సహనంతో బాబు ఆఫర్ చేసినా..: కేసీఆర్పై మండలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగేందుకు కేసీఆర్కు ఇష్టం లేదన్నారు. ఆదివారం గుంటూరులో తెలుగు భాషా వికాస సమితి ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్న మండలి బుద్ధప్రసాద్ మాట్లాడారు. కేసీఆర్ ఎంతసేపటికీ ఆయన ధోరణిలోనే నడుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు ఎంతో ఓర్పు, సహనం, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్న దక్షతతో వ్యవహరిస్తుంటే కేసీఆర్ మాత్రం కలిసి రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో అందరూ సమైక్యంగా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టి చంద్రబాబుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం: యనమల
ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ ఆకాంక్ష ముఖ్యమంత్రితో పాటు అందరిలోనూ ఉందన్నారు. తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్న ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎవరు ఎన్నిరకాలుగా పనిచేసినా భగవంతుడి సహకారం, ఆశీర్వచనం తప్పనిసరన్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన సీఎం చంద్రబాబుకు స్వామి ఆశీస్సులు మెండుగా ఉంటాయన్నారు. దేవాదాయశాఖ, టీటీడీ ప్రతిష్టను మరింత మెరుగుపరచడానికి సీఎం నడుంబిగించారన్నారు. అందులో భాగంగానే తిరుమలలో కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. టీటీడీ ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు చేయడంతో పాలనలో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీటీడీకి ఉన్న ప్రత్యేక ప్రతిష్టను చిరస్మరణీయం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందదన్నారు.