వారిలాగే బాబును గౌరవిస్తా, ఒళ్లు దగ్గర: కేసీఆర్, సిద్ధం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు సిద్ధమా అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రశ్నిస్తే ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఒక రమణ్ సింగ్, ఒక సిద్ధరామయ్య, ఒక పృథ్వీరాజ్ చౌహాన్, ఒక చంద్రబాబు అంటూ చెప్పారు.
పీపీఏల రద్దు, ఫీజు రీయింబర్సుమెంట్స్ తదితర అంశాల పైన ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడ ఉన్న విషయం తెలిసిందే. బుధవారం కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము చట్ట ప్రకారమే వెళ్తున్నామని, చంద్రబాబే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు.
చంద్రబాబు ఒకవైపు కారం పెట్టుకుంటూనే, మరోవైపు సఖ్యత అంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. బుల్డోజ్ చేస్తున్నారని, పీపీఏల రద్దు కథ ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబుతో అవసరమైతే చర్చలకు తామూ సిద్ధమేనన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనను గౌరవిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలంటూ.. పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్లాగా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్లాగా... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా గౌరవిస్తామన్నారు.
పొరుగు రాష్ట్రాల సీఎంలతో ఎలా వ్యవహరించాలి అనే విజ్ఞత తమకు ఉందన్నారు. తాను ఆయనను ముఖ్యమంత్రిగా గుర్తిస్తున్నానని, ఆయన మాత్రం తనను అలా గుర్తించడం లేదన్నారు. మాకు మీతో ఎంత అవసరమో, మీకు మాతో అంతే అవసరమని చంద్రబాబుకు పరోక్షంగా హితవు పలికారు. అందువల్ల డంబాచారాలు, ఢాంబికాలు వద్దని, ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకునే వ్యవహరించాలన్నారు.