డేటా చోరీ: ఏం చేద్దాం.. ఏజీతో చంద్రబాబు భేటీ, 'జగన్ కుతంత్రాలకు టీ ప్రభుత్వం సహకారం'
అమరావతి: హైదరాబాదులో ఐటీ దాడులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డేటా చోరీ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ, ఈడీ దాడులు అంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటికి తాము భయపడే ప్రసక్తి లేదని చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ వారిని బెదిరిస్తున్నారని, హైదరాబాదులో వ్యాపారాలు ఉన్న తమ పార్టీ వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఈ బెదిరింపులు ఉన్నాయని ఆరోపించారు.
ఏజీ దమ్మాలపాటితో చంద్రబాబు భేటీ
ఇదిలా ఉండగా, ఐటీ దాడులపై అడ్వోకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో అంతకుముందు సీఎం చంద్రబాబు దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. డేటా చోరీ ఆరోపణలపై చర్చించారు. ప్రయివేటు కంపెనీలో ఏపీ డేటా ఉండటం, పోలీసులు హైదరాబాద్ వెళ్లడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలపై చంద్రబాబు సమీక్షించారు.
జగన్ కుతంత్రాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోంది
జగన్ అరాచకాలు, ఆకృత్యాలు క్రమంగా బయటకు వస్తున్నాయని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. భీమిలిలో ఓటర్ల సంఖ్యను పరిశీలించామని చెప్పారు. తమ పరిశీలనలో నివ్వెరపోయే వాస్తవాలు బయటకు వచ్చాయని చెప్పారు. 2019లో తుది జాబితాలో చాలామంది పేర్లు ఆన్లైన్లో లేవని చెప్పారు. వైసీపీ కుతంత్రాలు చేస్తోందన్నారు. అప్రజాస్వామికంగా గెలవాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ కుతంత్రాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. కుట్రలను ఎదుర్కొనే సత్తా టీడీపీకి ఉందని చెప్పారు.
వైయస్ వివేకానంద రెడ్డి లాంటి ఓట్లు తొలగించే కుట్ర
ఓటర్ డేటా చోరీ విషయంలో ఎలాంటి తప్పు చేయకుంటే టీడీపీకి భయం ఎందుకని వైసీపీ నేత మిథున్ రెడ్డి అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి లాంటి నేతల ఓట్లు కూడా తొలగించేందుకు కుట్ర చేశారన్నారు. ఇంతకంటే దిగజారుడుతనం ఉందా అన్నారు. బోగస్ ఓట్లపై ఎంత దూరమైనా పోరాడుతామని, కేఏ పాల్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు పోలిన హెలికాప్టర్ గుర్తు ఇవ్వడంపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.