జగన్, కేసీఆర్లను యాగాలే గట్టెక్కించాయా ? రాజశ్యామల యాగం అంటే ఏంటీ ?
హైదరాబాద్ : యాగంతో రాజయోగం వస్తోందా ? రాజశ్యామల యాగం చేస్తే అధికారం సొంతమవుతుందా ? కొంతకాలం క్రితం కేసీఆర్, ఇటీవల జగన్ యాగం వల్లే విజయం సాధ్యమైందా ? వారి యాగాలే యోగం తెచ్చాయా అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతుంది. ఇంతకీ యాగంతో యోగం సాధ్యమేనా ? పండితులు ఏమంటున్నారు. వన్ ఇండియా ప్రత్యేక కథనం.
కేసీఆర్, జగన్ యాగాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ యజ్ఞ, యాగాదాలు చేస్తుంటారు. చండీ, సహస్ర, ఆయుత చండీయాగాలు కూడా చేశారు. అయితే గత డిసెంబర్లో జరిగే ఎన్నికలకు నెలరోజుల ముందు రాజశ్యామల యాగం చేశారు. ఆ తర్వాతే భారీ మెజార్టీతో విజయం సాధించి అధికారం చేపట్టారు. కేసీఆర్ను అనుసరించిన జగన్ విశాఖలో రాజశ్యామల యాగం చేశారు. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల్లో బంఫర్ మెజార్టీ సాధించారు. వీరిద్దరూ యాగాలతో యోగం సిద్ధించిందా ? అనే ప్రశ్న తలెత్తుతుంది. గ్రహస్థితి బాగుందా ? ప్రతిపక్ష నేతల బలహీనత కారణమా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు రాజశ్యామల యాగం అంటే ఏంటో తెలుసుకుందాం.
రాజశ్యామల యాగం అంటే ?
దశమహావిద్యలో విద్య పేరు మాతంగి. ఆ మాతంగిగి మరోపేరు రాజశ్యామల అని పేరు ఉంది. రాజరాజేశ్వరి దేవికి రాజశ్యామల మంత్రిగా వ్యవహరిస్తారు. మధురైలోని మీనాక్షి దేవి రాజశ్యామల దేవి స్వరూపమని పండితులు చెప్తున్నారు. మూడులోకాలకు తన ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా శ్యామల దేవిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. యాగం తర్వాత విష్ణువుకు యోగం కలిగిందని చరిత్రలో ఉంది. ఇక రాజశ్యామల యోగం చేస్తే ధర్మం ఉన్న వారికి తప్పకుండా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు.
యోగం తప్పదు ?
రాజశ్యామల యాగం చేసినవారికి యోగం తప్పకుండా సిద్ధిస్తుందని పురాణాల్లో ఉంది. అయితే ఆ సంబంధింత వ్యక్తి జన్మ నక్షత్రం బాగుండాలి. సంబంధిత వ్యక్తులు యాగం చేస్తే రాజయోగం పడుతుందని పండితులు చెప్తున్నారు. వారికి ఆకర్షణ పెరుగుతుందని, అధికారం చేపడతారని పేర్కొంటున్నారు. వారి వైరిపక్షం ఆటోమెటిక్గా బలహీనపడుతుందని .. ఎంత బలవంతులుగా ఉన్నా సరే సమయానికి వీక్గా మారాతారని గుర్తుచేస్తున్నారు. రాజశ్యామల యాగం సుభిక్షం కోసం, కోరిన కోరికలు తీర్చేందుకు తోడ్పడుతుందని చెప్తున్నారు. గతంలో చాలామంది నేతలు చేశారని .. ఇప్పుడు కూడా ఇళ్లలో సమాజానికి తెలియకుండా యాగం చేస్తున్నారని పేర్కొంటున్నారు.
రాజులు, నేతలు
గతంలో శ్రీకృష్ణదేవరాయలు, రెడ్డిరాజులు, కొండపల్లి రాజులు, గజపతి రాజులు రాజశ్యామల యాగాలు చేశారని చరిత్ర చెబుతోంది. అంతేకాదు యుద్ధానికి వెళ్లే సమయంలో విజయం కోసం రాజశ్యామల యాగం .. దాంతోపాటు వారాహి యాగం తప్పకుండా చేసేవారని తెలుస్తోంది. కేసీఆర్, జగన్ యాగాలు చేసినట్టు సమాజానికి తెలుసు. కానీ జగన్ పేరు మీద రాజశ్యామల యాగాలు చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. చిక్కడపల్లి, ఏపీలో చాలాచోట్ల జరిగినట్టు సమాచారం. వీరేకాక బీజేపీ నేత లక్ష్మణ్ కూడా రాజశ్యామల యాగం జరిపించారని .. అందుకే తెలంగాణలో 4 ఎంపీ సీట్లను గెలుచుకున్నారని తెలుస్తోంది. లేదంటే ఆ పార్టీకి ఒక్క అసెంబ్లీ స్థానం దక్కితే .. 4 ఎంపీ సీట్లు ఎలా గెలుస్తోందని వాదన వినిపిస్తోంది. ఇటు సినీనటుడు బాలకృష్ణ కూడా యాగం చేశారని .. అందుకే విజయం సాధించారని సమాచారం.