అవసరమైతే నేనే వెళ్తా: కెసిఆర్, తెరాసలోకి వెళ్లం: దానం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విద్యుత్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యుత్ కొనుగోలు కోసం అవసరమైతే తాను స్వయంగా ఛత్తీస్గఢ్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పారు. విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. అలాగే ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలుపై సంప్రదించేందుకు కార్యాచరణ తయారు చేయాలన్నారు. అవసరమైతే తానే స్వయంగా వెళ్లి అక్కడి సిఎంతో విద్యుత్ కొనుగోలుపై చర్చిస్తానని చెప్పారు.
కెసిఆర్ గురువారం శాఖల సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో క్లీన్ హైదరాబాద్పై జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించారు. సిటీలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చూడాలని ఆదేశించారు. 12 నుంచి 15 వరకు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. చెత్త డంపింగ్ యార్డులకోసం కనీసం వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు.
తాగునీటి ఆధారమైన గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల్లో కలుషిత నీరు కలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులు అన్యాక్రాంతం కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. గండిపేట, హిమయత్ సాగర్ను హుసేన్ సాగర్లా మార్చవద్దన్నారు. కాగా, కెసిఆర్ సచివాలయంలో జీహెచ్ఎంసీ, జలమండలి తదితరులతో భేటీ అయ్యారు.
కాంగ్రెస్లోనే: దానం
తాము పార్టీ మారమని మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురువారం చెప్పారు. తాము కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతామని చెప్పారు. ప్రతిపక్షంలోకి వచ్చాక తమ బాధ్యత మరింత పెరిగిందని వారు చెప్పారు. ఇస్కాన్ భూముల వివాదంపై తాము త్వరలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలుస్తామని చెప్పారు. వలసలను ప్రోత్సహించడం తెరాసకే నష్టమన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ సత్తా చూపిస్తామన్నారు.
ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం లేదు: శిద్దా
తమకు ఆర్టీసీ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి శిద్దా రాఘవ రావు వేరుగా చెప్పారు. పదిహేను శాతం ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ ప్రతిపాదన చేసిందన్నారు. తమకు మాత్రం ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం లేదన్నారు. ఆర్టీసీ పైన రోజుకు రెండు కోట్ల రూపాయల నష్టం వస్తుందన్నారు. నష్టాల నుండి బయటకు తీసుకు వస్తామన్నారు. రోడ్ల నాణ్యత దెబ్బతింటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
పుష్కరాలకు ఏర్పాట్లు
గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ గోదావరి పుష్కరాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాలకు పైగా దేవాదాయ భూములు ఆక్రమణలు, కోర్టు కేసుల్లో ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన చెప్పారు.