'ఈనాడు'ను తగులబెట్టి: కేసీఆర్ 'రామోజీ ఫిల్మ్సిటీ' వ్యాఖ్యలపై దాడి
హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక్క గుంట కూడా కబ్జాలో లేదని, అసైన్డ్ భూమీ లేదని, అందులో ప్రతి అంగుళం రామోజీ రావు కష్టపడి కొన్నదేనన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు.
కేసీఆర్ అభినవ గోబెల్స్ అని మండిపడుతున్నారు. నాడు ఈనాడు దినపత్రికలను తగలబెట్టారని ఆరోపిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని తాను నాగళ్లతో దున్నిస్తానని ఏనాడు చెప్పలేదనడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. అంతేకాదు, ఆ పత్రికలను తెలంగాణ వ్యతిరేక మీడియాగా కూడా ఎన్నోసార్లు చెప్పారని అంటున్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ రావు, కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో నాగళ్లతో దున్నిస్తానని తాను ఏనాడు చెప్పలేదని కేసీఆర్ చెప్పాననడాన్ని గోనె ప్రకాశ రావు, కేకే మహేందర్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫిల్మ్ సిటీనీ లక్ష నాగళ్లతో దున్నిస్తానని కేసీఆర్ అన్నారన్నారు. ఫిల్మ్ సిటీని దున్నే మొదటి నాగలి తనదే అన్నారన్నారు.
అందుకు సంబంధించిన క్లిప్పింగులు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. వారు ఈనాడు దినపత్రిక సంచికలు కూడా తగులబెట్టారని చెప్పారు. రామోజీ ఫిలిం సిటీని కేసీఆర్ మెచ్చుకోవడంలో తప్పులేదని, కానీ తాను ఆ మాట అనలేదని చెప్పడం మాత్రం సరికాదన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక్క గుంట కూడా కబ్జాలో లేదని, అసైన్డ్ భూమీ లేదని, అందులో ప్రతి అంగుళం రామోజీ రావు కష్టపడి కొన్నదేనని కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా హన్మకొండలో అన్న విషయం తెలిసిందే. ఓ విలేకరి రామోజీ ఫిల్మ్ సిటీ పైన ప్రశ్నలు అడిగారు. దానికి కేసీఆర్ జవాబిచ్చారు.
రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఒక్క గుంట ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేయలేదన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని తాను ఎన్నడూ అనలేదన్నారు. ఫిల్మ్ సిటీ ఒక అద్భుతమని కితాబునిచ్చారు. ఆంధ్రాతో సహా ఎక్కడి నుంచి వచ్చినా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్తో స్వాగతం ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని ఉద్యమ సమయంలో చెప్పిన మీరు.. తెలంగాణ రాష్ట్రం సాకారమైనతర్వాత ఇప్పుడు మాట మార్చారెందుకని ప్రశ్నించారు. దీంతో ఆ విలేకరిపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.