కెసిఆర్కు 17 సెప్టెంబర్ చిక్కులు: మజ్లీస్ దోస్తీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సెప్టెంబర్ 17 చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీని ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా, తెలంగాణ ఉద్యమ కాలంలో ఊరూరా సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడిగా కెసిఆర్ పిలుపునిచ్చారు.
మజ్లీస్తో దోస్తీ కారణంగా ఆయన సెప్టెంబర్ 17వ తేదీన ప్రభుత్వపరంగా నిర్వహించగలరా, లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 1948 డిసెంబర్ 17వ తేదీన నిజాం ఇండియన్ యూనియన్కు లొంగిపోయారు. దీంతో ఆ రోజును బిజెపి తెలంగాణ విమోచన దినంగా పాటించాలని డిమాండ్ చేస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కలిసిన అప్పటి హైదరాబాద్ రాజ్యంలోని జిల్లాల్లో ఆ ప్రభుత్వాలు అధికారికంగా సెప్టెంబర్ 17వ తేదీని నిర్వహిస్తున్నాయి.
మజ్లీస్ మాత్రం సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ను వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే, తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సెప్టెంబర్ 17వ తేదీన పార్టీల పరంగా నిర్వహించాయి. కానీ, అధికారికంగా నిర్వహించడానికి ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అంగీకరించలేదు.
యూనియన్ ప్రభుత్వం దాడి చేసి, బలవంతంగా హైదరాబాదును భారత్లో కలుపుకుందని అభిప్రాయం మజ్లీస్కు ఉంది. అదే సమయంలో తెలంగాణలోని విప్లవ శక్తులు కూడా తెలంగాణ విమోచన అనే పదాన్ని అంగీకరించడం లేదు. ఈ స్థితిలో సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు వస్తారా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.