కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్తో కెసిఆర్ భేటీ: విందుకు ఆహ్వానించిన వెంకయ్య
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దేశ రాజధానిలో బిజిబిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర సమస్యలపై చర్చిస్తున్నారు. సోమవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్తో ఆయన సమావేశమయ్యారు.
సమావేశంలో వాటర్గ్రిడ్, గ్రామీణ, రోడ్ల అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అంశాలపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ఆయనను కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మరో ఆరు జిల్లాలను వెనకబడిన జిల్లాలుగా గుర్తించాలని కోరారు.
ఈ సమావేశం ముగిసిన అనంతరం మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సిఎ కెసిఆర్ భేటీ కానున్నారు. కాగా, వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి కెసిఆర్ను విందుకు ఆహ్వానించారు. వెంకయ్యనాయుడుతో సోమవారం మధ్యాహ్నం కెసిఆర్ సమావేశమవుతారు.
గతంలో ఏపి సిఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో పర్యటించిన సమయంలో విందుకు ఆహ్వానించిన వెంకయ్యనాయుడు.. ఇప్పుడు తెలంగాణ సిఎం కెసిఆర్ను విందుకు ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కెసిఆర్ కూడా కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
నక్సల్స్ ప్రభావిత రాష్ర్టాల సిఎంలతో రాజ్నాథ్ సమావేశం
నక్సల్స్ ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ సమావేశమయ్యారు. సమావేశంలో నక్సల్స్ ఏరివేతకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. సమావేశానికి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా సీఎంలు హాజరయ్యారు. తెలంగాణ సిఎం బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ సమావేశానికి హాజరయ్యారు.