12ఏళ్ల కిందటి మొక్కు: అమ్మకు కేసీఆర్ బంగారు బోనం
హైదరాబాద్: అమ్మవారి దయ వల్లనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. లాల్ దర్వాజ మహంకాళీ అమ్మవారిని ఉదయం కేసీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ఆయన బంగారు బోనం సమర్పంచారు.
అనంతరం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు తాను ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నానని, తెలంగాణ వచ్చిన తర్వాత బోనం సమర్పించుకుంటానని మొక్కుకున్నానని చెప్పారు. అమ్మవారి దయవల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు.
లాల్ దర్వాజ అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా రూపుదిద్దుతామని తెలిపారు. మహంకాళీ అమ్మవారి ఆలయ విస్తరణకు కొంతస్థలం కేటాయించి, చిరకాలం గుర్తుకు ఉండేలా ఆలయ నిర్మాణం చేపడతామన్నారు. ప్రజలందరికీ అమ్మవారి దీవెనలు ఆకాంక్షించారు.
కేసీఆర్కు పూర్ణ కుంభంతో పూజారులు స్వాగతం పలికారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2002లో అమ్మవారికి మొక్కుకున్నారు. తెలంగాణ వస్తే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నారు. మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
మరోవైపు, బోనాల సందర్భంగా చిలకలగూడలోని కట్టమైసమ్మ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు.