సర్వే సందడి: ఏపీలో జగన్కు జై కొట్టిన ప్రజలు..తెలంగాణ సీఎంగా కేసీఆర్
2019 సాధారణ ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉంది. ఇక దేశం మొత్తం ఎన్నికల మూడ్లోకి వెళ్లి పోయింది. 2019కంటే ముందు ఈ ఏడాది చివరిలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్నాయి ఆయా రాజకీయ పార్టీలు. ఇక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సర్వేల సందడి మొదలైంది. పలు జాతీయమీడియా ఛానెళ్లతో కలిపి సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఇందులో భాగంగానే ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరుతో సర్వేలు నిర్వహించాయి. తెలంగాణలో ప్రజలు సీఎం కేసీఆర్కు మద్దతు పలుకగా... ఏపీలో చంద్రబాబును తిరస్కరించిన ప్రజలు జగన్కు జై కొట్టారు.
చంద్రబాబు విషయంలో శివాజీ చెప్పిందే జరిగిందా?...కొందరు ఔనంటున్నారు...ప్రత్యర్థులు మరోలా అంటున్నారు!
గులాబీ బాస్కే ప్రజల మద్దతు
తెలంగాణలో ఇండియాటుడే సర్వే నిర్వహించింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మిగతా పార్టీ నాయకులకంటే ముందంజలో ఉన్నారు. సెప్టెంబర్ 6న కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లుప్రకటించారు. ఇంకా ప్రభుత్వానికి గడుపు 8 నెలల సమయం ఉండగానే ఆయన రద్దు చేసి ఎన్నికలకు వెళుతున్నారు. పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చేసిన సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్నే కోరుతున్నవారు 43శాతం మంది ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎంగా చూడాలనుకునేవారు 18శాతం ఉండగా... తెలంగాణ బీజేపీ నేత జి. కిషన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నవారు 15శాతంగా ఉంది.
కేసీఆర్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుపై తెలంగాణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 48శాతం మంది ప్రజలు కేసీఆర్ పనితీరు బాగుందని తెలిపగా..26శాతం మంది సంతృప్తికరంగా లేదన్నారు. మరో 16శాతం మంది యావరేజ్ అన్నారు. ఇండియాటుడే మైయాక్సిస్ పోల్ తెలంగాణలోని ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో టెలిఫోన్ ఇంటర్వ్యూలు తీసుకుంది. ప్రతి నియోజకవర్గం నుంచి 7,110శాంపిల్స్ను తీసుకుని సర్వే చేసింది.
పరిశుభ్రత అంశం తెలంగాణ ఓటర్లు ఎక్కువగా నొక్కి ఒక్కానించారు. ఆ తర్వాత నిరుద్యోగం, వ్యవసాయం,ధరల పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానిగా 44శాతం మంది తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీకి మద్దతు తెలుపగా... కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి 39శాతం మద్దతు లభించింది.
ఆంధ్రప్రదేశ్లో జగన్కు జై కొట్టిన ప్రజలు
ఇండియాటుడే పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకుంటున్నారని తేలింది. జగన్కు 43శాతం ప్రజలు మద్దతు పలుకుతుండగా.. సీఎం చంద్రబాబుకు 38శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నారు. ఇక టీడీపీ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. 36శాతం మంది ప్రజలు చంద్రబాబు సర్కార్ పనితీరు బాగుందని చెబుతుండగా... 33శాతం మంది ప్రజలు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధానిగా రాహుల్కే ఏపీ ప్రజల మద్దతు
ప్రధాని అభ్యర్థిగా ఎవరికి మద్దతు పలుకుతారని ప్రశ్నించగా సమాధానం తెలంగాణకు భిన్నంగా వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే బాగుంటుందని 44శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. మోడీకి 38శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారు.
ఏపీలో కూడా ప్రజలు పరిశుభ్రతే ప్రధాన సమస్యగా ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వ్యవసాయ సమస్యలు, నిరుద్యోగం, ధరలపెరుగుదల, ఏపీలో సమస్యలుగా ఉన్నాయి. ఏపీలో ఇండియాటుడే పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 10,650 శాంపిల్స్ తీసుకుని సర్వే నిర్వహించింది.
మొత్తానికి జాతీయ మీడియా ఛానెళ్లు ఇచ్చిన సర్వే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అయితే సర్వేలు ఏమి చెబుతున్నా... ఓటు అనే ఆయుధం మాత్రం ఓటరు దగ్గరే ఉంటుంది. ఇప్పుడన్న పరిస్థితులు రేపు ఉంటాయో లేదో అన్న గ్యారెంటీ లేదు.