చంద్రబాబును లాగి, కేసీఆర్ వ్యూహాత్మకం: ఇరుకునపడ్డ టీడీపీ, మహాకూటమి!
అమరావతి/హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై బుధవారం తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. ఓటుకు నోటులో దొరికిన దొంగ అని, తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు.
తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి లేఖలు రాశారని ఆరోపించారు. మన కరెంట్ ఇవ్వకుండా రాక్షసానందం పొందిన రాక్షసుడు అన్నారు. ఇదే సమయంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల గురించి కూడా ప్రస్తావించారు. పోలవరం కోసం ఏపీలో కలిపిన మండలాల విషయంలో టీడీపీని ఇరకాటంలో పడేశారు.
కేసీఆర్ వ్యూహాత్మకంగా పోలవరం మండలాలపై
పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలను ఏపీలో కలిపిన అంశాన్ని కేసీఆర్ వ్యూహాత్మకంగానే తెరపైకి తెచ్చి ఉంటారని భావిస్తున్నారు. మన ఏడు మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీని, తద్వారా మహాకూటమిని కేసీఆర్ ఇరకాటంలో పెట్టారని అంటున్నారు.
చంద్రబాబు ఏం చెప్పుకున్నారంటే?
పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాల విషయంలో చంద్రబాబు పలుమార్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపాలని, లేదంటే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పానని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మండలాలను ఏపీలో కలుపుకున్నామని చెప్పారు.
చంద్రబాబును దోషిగా చూపించి, మహాకూటమిని దెబ్బతీసేలా
ఇప్పుడు ఇదే ఏడు మండలాలను కేసీఆర్ తెరపైకి తీసుకు వచ్చారు. సెంటిమెంట్ ద్వారా మహాకూటమిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కేసీఆర్ మాట్లాడుతున్నారని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయి. ఏడు మండలాలను ప్రస్తావించడం ద్వారా చంద్రబాబును దోషిగా చూపించి, మహాకూటమిని దెబ్బతీసే ఉద్దేశ్యమని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే, తెలంగాణలో ముందస్తు నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబును పదేపదే టార్గెట్ చేసుకోవడం ద్వారా మహాకూటమిని దెబ్బతీయవచ్చునని తెరాస భావిస్తోందని అనుకుంటున్నారు.
టీడీపీది మాట్లాడలేని పరిస్థితియా?
ఈ ఏడు మండలాల విషయంలో టీడీపీ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. కేంద్రం హామీ ఇచ్చింది కాబట్టి అంటే, ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఒకింత నష్టం, అలాగని మేం ఒత్తిడి చేయలేదని చెప్పలేదు. కాబట్టి తెలంగాణలో ఈ మాటల ప్రభావం కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. అయితే, ఓ టీవీ ఛానల్తో టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ... కేంద్రం పార్లమెంటులో బిల్లు పెట్టిందని, చంద్రబాబు గుంజుకున్నారని చెప్పడం సరికాదని అంటున్నారు.