రూ.5 కోట్ల శ్రీవారి మొక్కు చెల్లించనున్న కెసిఆర్: బెజవాడ దుర్గ నుంచి.. మొక్కులివే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తిరుమల వేంకటేశ్వర స్వామి వారికి, బెజవాడ కనక దుర్గమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. ఆ మొక్కులు చెల్లించే దిశలో కెసిఆర్ కదులుతున్నారు.
తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో రాష్ట్రం ఏర్పడాలంటూ కేసీఆర్ చాలా మొక్కులు మొక్కుకున్నారు. వాటిని ఇప్పుడు చెల్లించుకోవడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
తిరుమల శ్రీవారికి రూ.5.59 కోట్ల విలువైన మూలవర్ణ కమలము, బంగారు సాలిగ్రామ హారము, ఐదు పెంటల కంటె, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.30 నుంచి రూ.45 వేలతో బంగారు ముక్కుపుడక, విజయవాడ కనకదుర్గమ్మకు రూ.30 నుంచి 45 వేలతో బంగారు ముక్కుపుడక ఇస్తానని మొక్కుకున్నారు.
వరంగల్ కురవి వీరభద్ర స్వామికి రూ.60 నుంచి రూ.75 వేలతో బంగారు మీసాలు, వరంగల్ భద్రకాళి అమ్మవారికి రూ.57 లక్షల విలువైన 2 కిలోల కిరీటం చేయిస్తానని మొక్కుకున్నారు.
గ్రేటర్ ఎన్నికల అనంతరం, వచ్చే ఫిబ్రవరి నెలలో కెసిఆర్ తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. తిరుమలకు మొక్కులు చెల్లించేందుకు కేబినెట్ జనవరి 30వ తేదీన ఆమోదించింది. ఫిబ్రవరి 24వ తేదీన ఆర్డర్ జారీ చేసింది. శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు దేవాదాయ శాఖ డిపార్టుమెంటులోని కాన్ గుడ్ ఫండ్ నుంచి రూ.5.59 కోట్లు విడుదలయ్యాయి.
అయితే, ఈ విషయంలో ఆ తర్వాత కదలిక కనిపించలేదు. తాజాగా, గురువారం నాడు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు, విజయవాడ కనక దుర్మమ్మ తల్లికి చేయించే ముక్కు పుడక చెల్లింపు గురించి తెలియాల్సి ఉంది. అయితే, త్వరలో కెసిఆర్ విజయవాడ వెళ్లి అమ్మవారికి ముక్కుపుడక సమర్పిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.