జైరాంవి పిచ్చికూతలు, టీకి అన్యాయం చేశారు: కెసిఆర్
హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర మంత్రి జైరాం రమేష్పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమపై జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. శాసనసభ, లోకసభ అభ్యర్థుల సమావేశానంతరం కెసిఆర్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సర్పంచ్గా కూడా జైరాం రమేష్ గెలవలేదని ఆయన అన్నారు. జైరాం రమేష్ పిచ్చికూతలు కూస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణకు విభజనలో అన్యాయం చేసిందే జైరాం రమేష్ అని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ కాంగ్రెసు ఎన్నికల ప్రణాళిక తమ పార్టీ ప్రణాళికకు నకలు అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు ఏ పథకం చేపట్టినా ప్రజలకు పావలా మాత్రమే చేరుతుందని, ముప్పావలా ఆ పార్టీ నేతల జేబుల్లోకి పోతుందని ఆయన అన్నారు. తమ ఎన్నికల ప్రణాళికను వంద శాతం అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తాము 55 శాతం టికెట్లు బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చామని, 30 సీట్లు బీసీలకు ఇచ్చామని ఆయన చెప్పారు. తిరుగుబాటు అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకున్నారని, వారికి ధన్యవాదాలని ఆయన అన్నారు. ఉద్యమంలో పనిచేసి టికెట్లు దక్కనివారిపై తమకు సానుభూతి ఉందని, తర్వాతి అవకాశాల్లో వారికే ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీలుగా వారికి అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.
అడిగినవారందరికీ టికెట్లు ఇవ్వడం ఏ పార్టీకైనా కుదరదని ఆయన అన్నారు. తక్కువ వివాదాలతో తాము అభ్యర్థులను ఖరారు చేయగలిగామని ఆయన అన్నారు. కాంగ్రెసువాళ్లు అనవసరంగా మాట్లాడి నవ్వుల పాలు అవుతున్నారని ఆయన అన్నారు. తాము ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించలేమని ఆయన అన్నారు. కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్లో బహిరంగ సభలు ఉంటాయని ఆయన చెప్పారు. హోలోగ్రామ్ సభలు 700 దాకా ఉంటాయని ఆయన చెప్పారు. తాను 80 - 85 శాసనసభా నియోజకవర్గాలు తిరగాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.