ఢిల్లీకి తాబేదార్లం కాదు: రాహుల్ గాంధీకి కెసిఆర్ రిప్లై
వరంగల్: ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం తనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. రాహుల్ కంపెనీకి ప్రజా సమస్యలు పట్టవని ఆయన అన్నారు. తాము ఢిల్లీకి తాబేదార్లం కాదని జవాబు ఇచ్చారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి బహిరంగ సభలో ఆయన మంగళవారంనాడు ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమ పాత్ర లేనప్పుడు పార్టీ విలీనం గురించి ఎందుకు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసుకు ప్రజా సమస్యలు పట్టవా, తెరాసను విమర్శించడమే పనా అని ఆయన అడిగారు. 2004లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పాతాళంలోకి తొక్కి కాంగ్రెసుకు అధికారం అప్పగించామని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెసు నాయకుల అన్యాయాలను బయటపెడితే వారు తన ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమను ఓడించడానికి కాంగ్రెసువాళ్లు 186 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు. రాజకీయ పార్టీలను విలీనం చేసుకోవడానికే కొత్త రాష్ట్రాలు ఇస్తారా అని కెసిఆర్ అడిగారు. రాష్ట్ర ఏర్పాటులో తన పాత్ర లేదని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారని, ఆ మాటలు నమ్మవద్దని ఆయన అన్నారు.
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తమ అస్తిత్వాన్ని కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని అన్నారు. తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేమని అన్నారు. తన సుడిగాలి పర్యటనను కాంగ్రెసుకు కన్ను కుడుతోందని, దాంతో వాతావరణం సరిగా లేదని ఎటిసి అనుమతి ఇవ్వడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు వాళ్ల వద్ద ఉన్నట్లు తన వద్ద అక్రమాస్తులు లేవని ఆయన అన్నారు.
భూపాలపల్లిలో కొత్త గనులు వస్తాయని, అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఆయన అన్నారు. తెరాస శాసనసభ అభ్యర్థులనే కాకుండా లోకసభ అభ్యర్థులను కూగా గెలిపించాలని ఆయన కోరారు. వరంగల్ జిల్లా తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు.