చంద్రబాబును ఇరుకున పడేసిన కేసీఆర్! ఆశలు రేపిన యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిక్కుల్లో పడేశారు! కేసీఆర్ తెలంగాణ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీలోను ఉద్యోగుల నుండి అదే తరహా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తమకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఏపీఎన్జీవోలు శుక్రవారం నాడు డిమాండ్ చేశారు. వారు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణను కలిశారు. ఫిట్మెంట్ విషయమై కోరారు. పీఆర్సీ పైన తొమ్మిదో తేదిన ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వనుందని యనమల చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 43శాతం పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే నిధులు సాధించుకోగలమన్నారు. కేంద్రం నుంచి సాయం కోసం విజ్ఞప్తి చేసేందుకు ఈ నెల 8న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్తారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి కూడా తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావును ఈ విషయమై సవాల్ చేశారు. తెలంగాణ టీడీపీ నేతలు నిత్యం కేసీఆర్ను విమర్శించడం సరికాదన్నారు. అదే సమయంలో తాము ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని, చంద్రబాబుచే ఇప్పించగలరా అని సవాల్ చేశారు.
కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ సర్ ప్లస్లో ఉండగా, ఏపీలో అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన రాజధాని (హైదరాబాద్) తెలంగాణకు ఉంది. ఏఫీ రాజధానినే నిర్మించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎంత వరకు ఫిట్మెంట్ ఇస్తుందనే ఆసక్తికరంగా మారింది. ఏపీ ఉద్యోగులు 69 శాతం ఫిట్మెంట్ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ, 29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కమిటీ సూచించినట్లుగా తెలుస్తోంది.