దేశంలోనే చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని కేసీఆర్ చెప్పలేదా: ఎమ్మెల్యే రోజా
నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా చంద్రబాబు నాయుడిపై, అలాగే టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండవ రోజు సమావేశాల్నిప్రతిపక్ష టీడీపీ పదే పదే అడ్డుకోవడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారన్న రోజా చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు.
చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రోజా
మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఫైర్బ్రాండ్ , వైసిపి నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 4000 ఎకరాల భూమిని రైతుల నుండి దోచుకుని షేవ్ చేశారని అలాంటి చోట ఇంకేం సేవ్ చెయ్యాలని రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు అమరావతిని కాపాడండి అంటూ సేవ్ అమరావతి నినాదాలు చేస్తూ రైతులను మోసం చేశాడని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.
ప్రధాని మోడీ ఇచ్చిన నీరు, మట్టి ఉంచిన స్థలంలో శాశ్వత భవనాలు ఎందుకు కట్టలేదు
ప్రధాని మోడీ ఇచ్చిన నీరు, మట్టి ఉంచిన స్థలంలో శాశ్వత భవనాలు నిర్మించడంలో చంద్రబాబు ఎందుకు విఫలమయ్యారని ఆమె ప్రశ్నించారు. దేశంలో డర్టీ రాజకీయ నాయకుడిగా చంద్రబాబును తెలంగాణ సిఎం కెసిఆర్ అభివర్ణించారని ఆమె గుర్తు చేశారు. రాయలసీమ పరిణామాలపై నాయుడు గట్టిగా పెదవి విప్పడం సిగ్గుచేటు అని రోజా అన్నారు. రాష్ట్రానికి బుల్లెట్ రైలు తెస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడుపై ఆమె వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. లోకేష్ బుల్లెట్ రైలుతో ఆడుతున్నారా అని ప్రశ్నించారు.
సన్రైజ్ మాటున చంద్రబాబు బాబు తన సన్ ను రైజింగ్ చేశారన్న రోజా
ఈరోజు సమావేశాల్లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లును ప్రవేశపెడితే దానికి టీడీపీ అడ్డుపడటం దారుణమన్నారు. అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదని రోజా చెప్పారు. అమరావతిలో రాజధానికి తాము కూడా అప్పట్లో సపోర్ట్ చేశామని తెలిపారు. ఈ ఐదేళ్లలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేయలేదని ఆమె మండిపడ్డారు . చంద్రబాబు, లోకేశ్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. సన్రైజ్ మాటున చంద్రబాబు బాబు తన సన్ ను రైజింగ్ చేశారని ఆమె ఎద్దేవా చేశారు.
మహిళా డిప్యూటీ సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవటం పై ఫైర్
మహిళా మంత్రి, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతుంటే పదేపదే అడ్డుపడటం దారుణమని ఆమె ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ప్రతీ విషయంపై టీడీపీ గొడవ చేస్తోందని రోజా అన్నారు. మహిళలపై టీడీపీ సభ్యులు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, అసలు వారికి జ్ఞానం ఉందా అని రోజా టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు . సభలో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు తన ప్రసంగంలో ఒక్కసారి కూడా సీమ గురించి మాట్లాడలేదని ఆమె ఫైర్ అయ్యారు.
చంద్రబాబును డర్టీ పొలిటీషియన్ అన్నారని గుర్తు చేసిన రోజా
ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొగిడినట్లు మాత్రం టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. అయితే అదే చంద్రబాబును డర్టీ పొలిటీషియన్ అని కేసీఆర్ విమర్శించిన సంగతి మరచిపోయారా అని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిషియన్ దేశ చరిత్రలోనే లేడని కేసీఆర్ అన్న సంగతిని రోజా సభలో గుర్తు చేశారు. వికేంద్రీకరణ జరగకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని నిలదీశారు.
సామాజిక న్యాయం , అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే జగన్ నిర్ణయం
ఒక సామాజిక వర్గానికే న్యాయం చేసేలా చంద్రబాబు ప్రవర్తించాడని అందుకే సామాజిక న్యాయం అందరికీ జరిగేలా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని రోజా పేర్కొన్నారు . అమరావతి గురించి నానా హంగామా చేస్తున్న చంద్రబాబు ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కూడా ఎందుకు కట్టలేకపోయారని అడిగారు. తండ్రీ, కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుని, ఇప్పుడు అమరావతిపై హడావుడి చేస్తున్నారన్నారని రోజా మండిపడ్డారు.