నోరు పారేసుకోవద్దు: కెసిఆర్, సోనియా ఘనతే
తెలంగాణపై కఠినమైన నిర్ణయం తీసుకుని, దృఢ సంకల్పంతో అమలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణ ప్రజల తరఫున కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం ఆమె ఘనతేనని ఆయన కీర్తించారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన అన్ని వర్గాల వారికి పేరుపేరునా అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. అమర వీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు, వాటి నేతలకు ఆయన కృతజ్ఞతలు ప్రకటించారు.
ఇది ఒకరి ఓటమి, మరొకరి విజయం కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమ అస్తిత్వం తమకు కావాలనుకుని సాధించుకున్నారని ఆయన చెప్పారు. ఉద్యమ సందర్భంలో ఇరు ప్రాంతాల నేతలు, ప్రజలు, మేధావుల మధ్య వైమనష్యాలు తలెత్తి ఉండవచ్చునని, ఇక అది ముగిసిన అధ్యాయమని, వాటిని మరిచిపోవాలని, రెండు రాష్ట్రాల్లో తెలుగువారు కలిసి మెలసి ముందుకెళ్లాలని ఆయన అన్నారు. ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు అభివృద్ధి చెందేలా రెండు రాష్ట్రాలు కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు.
హైదరాబాద్లో ఉన్న ఆంధ్రావారు మా వాళ్లు కాదని ఎన్నడూ అనుకోలేదని అన్నారు వారిని బాధపెట్టాలనే దుష్ట తలంపు లేనేలేదని, వారంతా సుఖసంతోషాలతో, అద్భుతంగా జీవించవచ్చునని తెలంగాణ ప్రజల తరఫున హామీ ఇస్తున్నానని కెసిఆర్ చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మన్మోహన్తోపాటు లోక్సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ తదితరులనూ కలుస్తానని చెప్పారు. ఈ సంతోషకరమైన సమయంలో ఉద్యమానికి భావజాలాన్ని అందించిన జయశంకర్ సార్ మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని తెలిపారు.