కూతురైనా, కొడుకైనా జైలుకే: అవినీతిపై కెసిఆర్
సంగారెడ్డి: రాజకీయ అవినీతికి పాతరేసి తెలంగాణ ప్రజలకు నిబద్ధత, నీతివంతమైన పాలనను అందించినప్పుడే నవ తెలంగాణ నిర్మాణం సాధ్యమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు అన్నారు. ఆవగింజంత అవినీతికి తావులేకుండా బంగారు తెలంగాణ ఆవిష్కరించేందుకు మేస్ర్తిగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. అవినీతికి పాల్పడితే కొడుకైనా, కూతురైనా జైల్లో పెట్టించడానికి వెనుకాడే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గ కేంద్రం జోగిపేటలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో మాట్లాడారు. గత పాలకులు అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, తెలంగాణ సాధించుకున్న తరువాత మరింత బాధ్యతాయుతంగా పని చేసి సమస్యల పరిష్కారం కోసం రాజీలేకుండా పని చేస్తానని చెప్పారు.
కరెంటు కోతలు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు ఎవరు కారణమో ఈ ప్రాంత ప్రజలకు తెలుసని, 60 ఏళ్ల దేశ చరిత్రలో రాష్ట్రాన్ని కాంగ్రెస్, టిడిపిలే పాలించాయని, అదే ఇక్కడి ప్రజలకు శాపంగా మారిందని ఆయన అన్నారు. చెరువులు, ఇతర ఇరిగేషన్ పనుల పేరిట 150 కోట్ల రూపాయలు ఆందోల్ నియోజకవర్గంలో పక్కదారి పట్టాయని అందుకు కారకులెవరో అందరికి తెలుసని కాంగ్రెసు నేత దామోదర నర్సింహను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఉచిత నిర్భంద విద్యను అందించే బాధ్యతను ఎస్ఐకి అప్పగిస్తానని, ఏ ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు వెళ్లలేదని తెలిస్తే సదరు ఎస్ఐని సస్పెండ్ చేస్తానని చెప్పారు. పోలీసులకు కూడా సామాజిక సేవా దృక్పథాన్ని అలవాటు చేయాలన్నదే తన ఉద్దేశమన్నారు. 40 లక్షల మంది విద్యార్థులకు కెజి నుంచి పిజి వరకు సకల సౌకర్యాలతో ఉచిత విద్యను అందిస్తామన్నారు.
ఆంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతానికి వెళ్లకుండా ఆప్షన్ అడిగారని, ఇక్కడ ఆంధ్ర ఉద్యోగులు అడ్డా వేస్తే తెలంగాణ ప్రాంతానికి చెందిన 1.50 లక్షల మంది నిరుద్యోగులకు అవకాశం లేకుండాపోతుందనే ఉద్దేశంతోనే ఆప్షన్ను వ్యతిరేకించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామన్నారు. రానున్న మూడేళ్లలో 1300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసుకుని కరెంటు సమస్య లేకుండా చేస్తామని తెలిపారు.