రామోజీ రావుతో కెసిఆర్ చీకటి ఒప్పందం: మధు యాష్కీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుతో చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు నేత మధయాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలు బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నేతలకు భయపడి అధికారులు పనులు చేస్తే తర్వాత జైలుకు పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
హెల్త్స్కామ్లో ఉన్నది ఎవరో కేసీఆర్ బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజయ్యని బలిపశువును చేశారని, మెడికల్ సీట్ల కోసం కేసీఆర్ కుటుంబానికి వెయ్యి కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని ఆయన విమర్శించారు. మిషన్ కాకతీయను మిషన్ కల్వకుంట్లగా మార్చారని మాజీ మధుయాష్కీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ మొత్తం తెలంగాణద్రోహులతో నిండిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణద్రోహులంతా టిఆర్ఎస్లోనే ఉన్నారని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ 15 నెలల ఒక్క రోజు మాత్రమే ఉంటాడని తెలంగాణ తెలుగుదేశం నేత కొత్తకోట దయాకరరెడ్డి జోస్యం చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం కూలడమా, మధ్యంతర ఎన్నికలా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. దళితులను సీఎంని చేస్తే అవినీతికి పాల్పడతారనే సందేశాన్పి కేసీఆర్ ప్రజల్లోకి పంపదలుచుకున్నాడని ఆయన అన్నారు. కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెసు నేత దానం నాగేందర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎల్ రమణ కెసిఆర్ తీరును తప్పు పట్టారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వ్యవస్థాపక నేత మందకృష్ణ మాదిగ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.