డిబార్ చేస్తామన్న కెసిఆర్: భయపడమన్న జూడాలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జూనియర్ డాక్టర్లపై మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించకుంటే వైద్య విద్య ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఏడాదిపాటు సేవ చేయాల్సిందేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా తమ విధులకు దూరంగా ఉంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మంగళవారంలోగా జూనియర్ డాక్టర్లు విధులకు హాజరుకాని వారికి ఉపకార వేతనాలు నిలిపివేయడంతోపాటు.. 6 నెలల డిబార్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. దీన్ని అమలు చేయాలని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది.
జూనియర్ డాక్టర్లకు నోటీసులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. జూనియర్ డాక్టర్ల తల్లిదండ్రులకు కూడా దీనిపై ప్రభుత్వం సమాచారం పంపినట్లు తెలుస్తోంది. జూడాల సమ్మెపై సిఎం కెసిఆర్ గవర్నర్ భేటీలో కూడా చర్చించినట్లు తెలిసింది.
ఇంతకుముందు కూడా ప్రభుత్వం వైద్యులను విధుల్లో చేరాలని.. లేదంటే జూడాలపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించింది. చర్చలకు జూనియర్ డాక్టర్లు ముందుకు రాకపోవడం సరికాదని, గ్రామీణ సర్వీసుల నిబంధన న్యాయస్థానాల్లో ఉందని పేర్కొంది. దానిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలిపింది.
చట్ట ప్రకారం జూనియర్ డాక్టర్లు ఏడాదిపాటు రూరల్ సర్వీసు చేయాల్సిందేనని పేర్కొంది. సమ్మెను ఎదుర్కొవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. సమ్మెల పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం జూడాలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్మా ప్రయోగించేందుకు కూడా తాము వెనకాడబోమని తేల్చి చెప్పింది.
భయపడం: జూడాలు
తమ డిమాండ్లను పరిష్కరించేవరకు తాము సమ్మెను కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. జూనియర్ డాక్టర్లు జేఏసి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలకు దిగారు. ప్రభుత్వం డిబార్ చేసినా.. నోటీసులు ఇచ్చిన భయపడబోమని జూడాల జేఏసి తేల్చి చెప్పింది. తాము చేస్తున్న పోరాటం న్యాయమైనదని చెప్పింది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జూడాల జేఏసి పేర్కొంది.
సమ్మె ఉపసంహరించండి: హైకోర్టు
సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు వెంటనే ఉపసంహరించుకోవాలని హైకోర్టు సోమవారం వారిని ఆదేశించింది. సమ్మెతో రోగులను ఇబ్బంది పెట్టడం సరికాదన్న హైకోర్టు పేర్కొంది. డాక్టర్లకు సమ్మె చేసే అర్హత లేదని, వారు దినసరి కూలీలు కాదని తెలిపింది. ఏవైనా సమస్యలుంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని హైకోర్టు కోరింది.
సమ్మె విరమించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హైకోర్టు జూనియర్ డాక్టర్లను హెచ్చరించింది. సమ్మెపై ఓ పిటిషనర్ వాదన విన్న కోర్టు ఈ మేరకు స్పందించింది. విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.