ఇంకా ఉద్యోగ నేతవి కావు: గౌడ్తో కేసీఆర్, చాన్నాళ్లకు కోదండతో..
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఉద్యోగుల పీఆర్సీ పైన ఉద్వేగంగా మాట్లాడుతుండగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఎన్జీవో డైరీని మంగళవారం నాడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్, స్వామిగౌడ్, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ తదితరులు హాజరయ్యారు.
కోదండరామ్, కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఎదురుపడ్డారు. వారు కరచాలనం చేసుకున్నారు. అనంతరం డైరీ ఆవిష్కరణ సమయంలో స్వామి గౌడ్ ఉద్యోగుల పీఆర్సీ పైన మాట్లాడారు. ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని ఉద్వేగంగా ప్రసంగించారు.
ఈ సమయంలో కేసీఆర్ ఆయన వెన్నుతట్టి.. ఇంకా ఉద్యోగ సంఘం నేతవు కావు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు వీరోచితంగా పోరాడారని చెప్పారు. ఉద్యమం సమయంలో సకల జనుల సమ్మె చాలా కీలకమైనదన్నారు.
జనవరి మూడో వారంలో ఉద్యోగులు సంతృప్తి చెందేలా పీఆర్సీ ఉంటుందని చెప్పారు. నూతన సంవత్సర కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామన్నారు. తాను కూడా మీలో ఒకడినేనని చెప్పారు. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకేచోట ఉండేలా చూస్తామన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండాలన్నారు. ఉద్యోగులకు ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే మరో స్పెషల్ ఇంక్రిమెంట్ ఉంటుందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను తమ ప్రభుత్వం విస్తరిస్తుందని చెప్పారు. విద్యుత్ రంగంలో ప్రయివేటు రంగ సంస్థలను ప్రోత్సహించమని చెప్పారు. ఉద్యోగుల విభజన పూర్తి అయితే ఖాళీ వివరాలు తెలుస్తాయని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అన్ని రాష్ట్రాలు విమానాశ్రయాలు అడుగుతున్నాయి: అశోక్ గజపతి రాజు
దేశంలోని అన్ని రాష్టాలు కొత్త విమానాశ్రయాలు కావాలని కోరుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. ఆయన హైదరాబాదులో మాట్లాడారు. విమానయానంలోని కొత్త విధానాల పైన రాష్ట్రాల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. ఈ మధ్యనే రాజమండ్రి విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ ప్రారంభించామన్నారు.