వైఎస్ దాడి చేస్తే: రామోజీ ఫిల్మ్సిటీకి కేసీఆర్ క్లీన్చిట్, అలా అన్లేదని ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక్క గుంట కూడా కబ్జాలో లేదని, అసైన్డ్ భూమీ లేదని, అందులో ప్రతి అంగుళం రామోజీ రావు కష్టపడి కొన్నదేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా హన్మకొండలో అన్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓ విలేకరి రామోజీ ఫిల్మ్ సిటీ పైన ప్రశ్నలు అడిగారు. దానికి కేసీఆర్ జవాబిచ్చారు.
రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఒక్క గుంట ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేయలేదన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని తాను ఎన్నడూ అనలేదన్నారు. ఫిల్మ్ సిటీ ఒక అద్భుతమని కితాబునిచ్చారు. ఆంధ్రాతో సహా ఎక్కడి నుంచి వచ్చినా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్తో స్వాగతం ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని ఉద్యమ సమయంలో చెప్పిన మీరు.. తెలంగాణ రాష్ట్రం సాకారమైనతర్వాత ఇప్పుడు మాట మార్చారెందుకని ప్రశ్నించారు. దీంతో ఆ విలేకరిపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నీకెవడు చెప్పిండయ్యా నాకర్థం కాదు.. ఎక్కడ అన్నానో చూపిస్తావా? అవన్నీ మీరు కల్పించుకున్న స్టోరీలు.. ఏ పత్రిక నీది? ఏ పత్రికో నాకర్థం కావట్లేదు... నువ్వొక్కడివే ఉన్నావయ్యా ప్రపంచంలో... అనని దాన్ని అన్నట్టు రాసి ఇష్టమొచ్చినట్టు డ్రామాలు కొట్టి జర్నలిస్టులకు ఎథిక్స్ ఉండాలి... కేసీఆర్ ఎప్పుడన్నా అన్నాడా... రామోజీ ఫిల్మ్ సిటీ దున్నుతానని.. రామోజీ ఫిల్మ్ సిటీ కబ్జా పెట్టిండ్రని అన్ననా ఎప్పుడన్నా అని భగ్గుమన్నారు.
అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రామోజీ ఫిల్మ్ సిటీ మీద దాడి చేస్తే ఇది అన్యాయమని తాను అడ్డుకున్నానని చెప్పారు. ఆయామ్ ఆన్ రికార్డు అన్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా అడ్డం పొడుగు ప్రశ్నలు అడిగితే ఎలా అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిజంగానే అద్భుతమని నేనంటున్నానన్నారు. ఒక్క గుంట కూడా ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టలేదన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీ గురించి నీకేం తెలుసు.. స్టోరీలు చెబుతావు.. ఆయన గవర్నమెంట్ ల్యాండ్ను అక్వయిర్ చేయలేదన్నారు. నేనొక సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీకి పోతే తనకు చూపించారని, అసైన్డ్ భూములు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీశానని చెప్పారు.
దళితులకు చెందిన పదమూడున్నర ఎకరాల అసైన్డ్ భూమిని మావాళ్లు తెలియక కొన్నారని చెప్పారని, తాను కాంపౌండ్ వాల్ తీసేసి వాళ్లది వాళ్లకు అప్పచెప్పానని ఆర్ఎఫ్సీలో చెప్పారని, డబ్బులు కూడా తీసుకోలేదని చెప్పారని వివరించారు. రామోజీ రూ.4 వేల కోట్లతో ఓం సిటీ కట్టబోతున్నాడని, అది పూర్తయితే రోజుకు లక్షమంది విజిటర్స్ వస్తారన్నారు. గొప్ప సంస్థను యాడ్ చేస్తున్నప్పుడు వాళ్లు ఎవరైతే ఏమిటి.. ఎందుకు వద్దంటామన్నారు.