జగన్ కు కేసీఆర్ కీలక సూచనలు: మూడు రాజధానులపైనా ఇలా: గెలుపే పరిష్కారం...!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మూడు రాజధానుల అంశం పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మూడు రాజధానులు..విశాఖ నుండి పరిపాలనా రాజధాని పైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం పైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార వికేంద్రీకరణ దిశగా తీసుకున్న చర్యలను వివరించారు.
ఏపీలో ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల పైనా చర్చించారు. ఇక..మూడు రాజధానుల విషయంలో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందనే దాని పైన తన అబిప్రాయలను జగన్ తో పంచు కున్నారు. ఆర్టీసీ సమ్మె పరిస్థితులను ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే అన్నింటికీ పరిష్కారం అని కేసీఆర్ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ కాళ్లు మొక్కిన విజయసాయిరెడ్డి.. ప్రగతి భవన్లో ఇద్దరు సీఎంలు.. చంద్రబాబు, బీజేపీపైనా చర్చలు
ముందుకే వెళ్లండి...
ఏపీలో మూడు రాజధానుల అంశం పైన ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో కీలకంగా చర్చ జరిగింది. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలోచన మంచిదని..ఇప్పుడు ఆందోళన చెందు తున్న వారు సైతం మున్ముందు అర్ధం చేసుకుంటారంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణతో ఇప్పటికిప్పుడు కాకపోయినా దీర్ఘకాలంలో సత్ఫలితాలు వస్తాయని జగన్ తో చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఈ నిర్ణయం పైన ముందుకే సాగాలని సూచించినట్లు సమాచారం. దీనిపై ఆందోళనలు తాత్కాలికమేనని..ప్రతిపక్షాలను పట్టించుకోవద్దని సూచించారు. అమరావతి కేంద్రంగా అభివృద్ధిని పరిమితం చేయకుండా..మూడు రాజధానులు ఏర్పాటు ద్వారా వికేంద్రీకరణ చేయడం వివేకవంతమైన నిర్ణయంగా సీఎం కేసీఆర్ అభివర్ణించినట్లు తెలిసింది.
అవసరమైతే కఠినంగా ఉండాలి...
అమరావతి చర్చలో భాగంగానే..ప్రజలకు మేలు చేసే నిర్ణయం అయినప్పుడు కఠినంగానే వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కేసీఆర్ సూచించారు. తెలంగాణలో యూనియన్ నాయకుల మాటలు నమ్మి, మొండి పట్టుదలకు పోయి ఆర్టీసీ కార్మికులు 50 రోజులకుపైగా సమ్మె కొనసాగించారని, ఈ విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని కేసీఆర్ గుర్తు చేశారు.
గెలుపే అన్నింటికీ పరిష్కారం..
టీఎస్ఆర్టీసీ సమ్మె పరిస్థితిపై తాను స్వయంగా గణాంకాలు సహా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లానని, దాంతో, కార్మికులకు జ్ఞానోదయమైందని, వారు సమ్మె విరమించి, ఇప్పుడు మంచిగా విధులు నిర్వహించుకుంటున్నారని చెప్పారు. వారు అలాగే పనిచేస్తే, త్వరలోనే టీఎ్సఆర్టీసీ లాభాల బాటలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. అందుకే, నిర్ణయం సరైందని అనుకున్నప్పుడు, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, కాస్త ఆలస్యంగానైనా ప్రజలు నిజాలను తెలుసుకుంటారని జగన్తో కేసీఆర్ అన్నట్టు తెలిసింది.
గెలుపే అన్నింటికీ పరిష్కారం..
ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని కూడా జగన్కు తెలంగాణ సీఎం సూచించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పారని తెలిసింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలోనే జరిగిన హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 40 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించినట్లుగా సమాచారం.
సుదీర్ఘ భేటీలో
తెలంగాణ సీఎం కేసీఆర్తో సుదీర్ఘంగా సాగిన భేటీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సైతం మూడు రాజధానుల ప్రతిపాదనల వెనుక తన ఉద్దేశాన్ని..తన ప్రణాళికలను వివరించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ నెల 20న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో రాజధాని అంశం పైన తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.