జగన్కు కేసీఆర్ మరో సవాల్- తేనెతుట్టెను కదుపుతూ-బీజేపీ నుంచీ తప్పని ఒత్తిడి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో ఏర్పడిన టీఆర్ఎస్, టీడీపీ-బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడూ ఉప్పూనిప్పులా వ్యవహరించేవి. ఎప్పుడో ఓసారి అమరావతి ప్రారంభం వంటి కొన్ని సందర్భాల్లో తప్ప ఎప్పుడూ ఏదో ఒక వివాదంతోనే సావాసం చేయాల్సిన పరిస్ధితి. అయితే 2019లో ఏపీలో వైసీపీ సర్కారు ఏర్పాటైన తర్వాత ఇరు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేసీఆర్-జగన్ నిర్ణయం తీసుకున్నా వాస్తవంలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. ఇదే క్రమంలో తాజాగా కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం జగన్కు మంటపుట్టించేలా కనిపిస్తోంది.
Recommended Video
సుప్రీంకోర్టులో ఏపీ పంచాయతీ- సర్కారు అప్పీలు-ఎస్ఈసీ కేవియట్- తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
జగన్కు రిజర్వేషన్ల సవాల్ విసిరిన కేసీఆర్
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్ ప్రత్యేకంగా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటికీ ఈ కోటా అమలవుతోంది. కానీ రాష్ట్రాలు మాత్రం ఈ కోటాను అమలు చేసే విషయంలో భిన్నాభిప్రాయాలతో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కోటా ఇప్పటికీ అమలు కాలేదు. కానీ తాజాగా కేసీఆర్ సర్కారు పదిశాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వంపై ఆ మేరకు ఒత్తిడి పెరగబోతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు జగన్ సర్కారుతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయించాలని కోరుతూ గవర్నర్ను పలుమార్లు కోరారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ నిర్ణయం జగన్కు పెను సవాలు కానుంది.
తేనెతుట్టెను కదిపేందుకు జగన్ నిరాసక్తత
కేంద్రం రెండేళ్ల క్రితమే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించినా ఏపీలో వైసీపీ సర్కారు మాత్రం దాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధం కాలేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఈ కొత్త రిజర్వేషన్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్ధల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. వీటిపై ఇప్పటికే రిజర్వేషన్ల ఫలాలు అందుకుంటున్న వారిలో పలు అనుమానాలు, భయాలు ఉన్నాయి. అన్నింటికంటే మించి వీరంతా వైసీపీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న వారే. దీంతో ఈ కొత్త రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నిస్తే వారి నుంచి వ్యతిరేకత తప్పదని జగన్ అంచనా వేసుకుంటున్నారు.
బీజేపీ నుంచి ఇప్పటికే జగన్పై ఒత్తిడి
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్టాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు రెండేళ్ల క్రితమే ఆదేశాలు ఇచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అది అమల్లోకి రాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తమకున్న బలాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ కూడా ఈ రిజర్వేషన్ల అమలుకు ఒత్తిడి చేయలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో పరిస్ధితి మారుతోంది. దీంతో అక్కడ కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. దీంతో కేసీఆర్ ఎట్టకేలకు రిజర్వేషన్లకు సై అనేశారు. కానీ ఏపీలో మాత్రం బీజేపీ నేతలు ఈడబ్ల్యూఎస్ కోటా అమలు కోసం గవర్నర్ను ఇప్పటికే పలుమార్లు కోరారు. జగన్ సర్కారుకు లేఖలు కూడా రాశారు. అయినా జగన్ మాత్రం ముందడుగు వేయలేదు.
కేసీఆర్ నిర్ణయంతో జగన్పై పెరగనున్న ఒత్తిడి
గతంలో కేంద్రం ఆదేశాలు ఇచ్చినా, బీజేపీ నేతలు రాష్ట్రంలో ఒత్తిడి చేస్తున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను నిర్లక్ష్యం చేసిన సీఎం జగన్కు ఇప్పుడు కేసీఆర్ నిర్ణయంతో తాము కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి ఏర్పడింది. లేకపోతే ఇప్పటివరకూ గవర్నర్ ఫిర్యాదులకు పరిమితమైన బీజేపీ.. ఎన్నికల అస్త్రంగా మార్చే అవకాశాలున్నాయి. దీంతో ఈ ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేస్తామనో, త్వరలో నిర్ణయం తీసుకుంటామనో, అధ్యయనం చేస్తున్నామనో ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్ధితి జగన్ సర్కారుకు తలెత్తింది. లేకపోతే కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే జగన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారని విపక్షాలన్నీ మూకుమ్మడిగా టార్గెట్ చేసే అవకాశముంది.