మూడు రాజధానులు చేసేయ్ అని కేసీఆర్ జగన్ కు చెప్పారు .. అందుకే ఇదంతా : జేసీ దివాకర్ రెడ్డి
జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.మూడు రాజధానులు చేసేయ్ అని కేసీఆర్ జగనుకు చెప్పారట అందుకే జగన్ ఈ పని చేశారంటూ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో చెల్లించేసి తన గురు భక్తిచాటుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఒకే ఒక్క డీల్ లో జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుతున్నారని ఆయన అన్నారు.
రాయలసీమకు హైకోర్టు వస్తే పది జిరాక్స్ షాపులు పెరగటం తప్ప ఏం లాభం : జేసీ దివాకర్ రెడ్డి
ఓ ఏడాది, ఏడాదిన్నరలో భారతి ముఖ్యమంత్రి కావ చ్చన్న జేసీ దివాకర్ రెడ్డి
గుంటూరు జిల్లా అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా మందడం గ్రామాన్ని సందర్శించి తన సంఘీభావం ప్రకటించిన జేసి దివాకర్ రెడ్డి సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీలోని పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని అన్నారు. ఇప్పుడు పారిశ్రామిక వేత్తలకు ఏపీపై నమ్మకం, విశ్వాసం పోయాయని ఆయన పేర్కొన్నారు. ఓ ఏడాది, ఏడాదిన్నరలో భారతి ముఖ్యమంత్రి కావచ్చని మరోసారి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం శ్మశానమే అవుతుందన్న జేసీ
ఇక మంత్రి బొత్స రాజధాని శ్మశానం అని అన్నాడని, నిజంగా మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం శ్మశానమే అవుతుందని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతినే ఉండాలని ఆయన పేర్కొన్నారు. జగన్ వ్యవహార శైలి దున్నపోతుపై వాన కురిసినట్టే ఉందని ఆయన అన్నారు.మనిషికి తల ఎంత ముఖ్యమో రాజధానికి సెక్రటేరియట్, అసెంబ్లీ అంతే ముఖ్యమని జేసీ చెప్పారు. సీఎం జగన్ తల కోా చోట, మొండెం ఒక చోట, కాళ్ళు చేతులు మరోచోట పెడితే కుదరదని ఆయన పేర్కొన్నారు.
జగన్ దృష్టిలో ప్రజలు గొర్రెలు
జగన్ ఉద్దేశంలో ప్రజలు గొర్రెలని, ప్రజలు గొర్రెలు కాకపోతే 151 సీట్లు ఎలా ఇస్తారని జేసీ వ్యాఖ్యానించారు. గన్ వల్ల తనకు చెడ్డపేరు వస్తుందని.. బెంగళూరు పంపిస్తానని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో తనతో అనేవారని దివాకర్ రెడ్డి చెప్పారు . సీఎం జగన్ మోహన్ రెడ్డి కుల ద్వేషం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని, సీఎం అవూతూనే రాజధాని మార్చాలని జగన్ అనుకున్నాడని చెప్పారు.
వ్యక్తి ద్వేషం , కుల ద్వేషమే రాజధాని రగడకు కారణం అన్న జేసీ దివాకర్ రెడ్డి
కృష్ణా , గోదావరి నదుల వల్లే ఈ ప్రాంతంలో డబ్బు ఎక్కువగా ఉందని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. మెజార్టీ వ్యక్తులు ఈ ప్రాంతంలో భూములు కొని ఉండొచ్చేమో కానీ కేవలం ఒక సామాజిక వర్గం అయిన కమ్మ వాళ్లే భూములు కొనలేదని చెప్పారు. ఒక కులంపై, వ్యక్తిపై ద్వేషంతో ఇలా చేయడం మంచిది కాదని జేసీ దివాకర్ రెడ్డి హితవు పలికారు. విశాఖలో వైసీపీ నేతలు భూములు కొన్నారని, ఏడు నెలలుగా విజయసాయిరెడ్డి విశాఖలోనే తిష్టవేశాడని దివాకర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సలహాతోనే రాజధాని మారుస్తున్నారని దివాకర్ రెడ్డి ఆరోపించారు.