అన్యాయం సరిచేయాలి: కెసిఆర్, మెట్రోపై వివరణ
హైదరాబాద్/ న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కృష్ణా, గోదావరి నదులపై ఏర్పాటైన బోర్డుల చైర్మన్ల పండిట్, అగర్వాల్లను కోరారు. వారు సోమవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు అన్ని ప్రాజెక్టులపై ఆపరేషన్ రూల్స్ తయారు చేసి అమలు చేయాలని కెసిఆర్ సూచించారు.
ప్రాజెక్టుల గేట్లు, నీటి విడుదల బోర్డులే నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల వద్ద సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలతో రక్షణ ఏర్పాటు చేయాలని అన్నారు. కృష్ణా ప్రాజెక్టుల స్వరూపం తెలుసుకునేదుకు చైర్మన్లు పర్యటన చేపట్టాలని సూచించారు.
కృష్ణా, గోదావరి బోర్డులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని, బోర్డుల నిర్వహణ కోసం ఒక్కో బోర్డుకు రూ.5 కోట్లు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్, ముఖ్య పట్టణాలకు నీటి కేటాయింపు జరిగిన తర్వాతనే పంపకాలు జరగాలని అని అన్నారు. హైదరాబాదుకు 50 టిఎంసిల నీరు కేటాయించాలని ఆయన కోరారు.
బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీయడానికే..
ఇదిలావుంటే, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సలహాదారు పాపారావు సోమవారం కేబినెట్ కార్యదర్శిని, ప్రధాని ముఖ్య కార్యదర్శిని కలిసి హైదరాబాదు మెట్రో రైలుపై వివరణ ఇచ్చారు. ఎల్ అండ్ టీ చేపట్టిన అన్ని ప్రాజెక్టుల కన్నా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు సాగుతున్నాయని రాజీవ్ శ్రమ వారికి చెప్పారు. ఎటువంటి పెండింగ్ అంశాలు మెట్రో రైలు విషయంలో లేవని ఆయన చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టు నిలిచిపోతుందని ప్రచారం చేస్తూ కొంత మంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని పాపా రావు విమర్శించారు.