వాస్తు విశ్వాసం: బాబును కెసిఆర్ భయపెట్టారా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వాస్తు విశ్వాసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా పాకినట్లు కనిపిస్తోంది. వాస్తు కారణంగా సచివాలయాన్ని ఖాళీ చేయాలని కెసిఆర్ భావిస్తున్న తరుణంలో అదే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కెసిఆర్ వాస్తు విశ్వాసమంతా చంద్రబాబును కూడా ఆలోచింపజేస్తున్నట్లు చెబుతున్నారు.
కృష్ణా నదీ తీరంపై గుంటూరు జిల్లాలో ఎపి రాజధాని నిర్మాణం వాస్తుపరంగా ఉత్తమమైందని కెసిఆర్ ఇటీవల చంద్రబాబు అన్నారు. అందుకు చంద్రబాబును అభినందించారు కూడా. ఈ అభినందనకు చంద్రబాబు ఖుషీ అయినట్లు చెబుతున్నారు. అదే సమయంలో వాస్తుకు అనుగుణంగా లేకపోవడంతో సచివాలయాన్ని మార్చేస్తానని కెసిఆర్ చంద్రబాబుతో చెప్పారని అంటున్నారు.
తాను సచివాలయాన్ని మారుస్తున్నట్లు చెప్పిన కెసిఆర్ దాన్ని ఎక్కడికి, ఎప్పుడు మారుస్తాననే విషయాన్ని మాత్రం చెప్పలేదని అంటున్నారు. దాంతో సచివాలయం వాస్తు దోషం చంద్రబాబును కూడా ఆలోచనలో పడేసిందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హైదరాబాదులోని సచివాలయం ఎల్ బ్లాక్ నుంచి పనిచేస్తున్నారు. శాఖాధిపతుల కార్యాలయాలను త్వరలోనే విజయవాడకు మార్చే యోచనతో ఆయన ఉన్నారు.
అయితే, వాస్తు దోషం పేరు చెప్పి కెసిఆర్ చంద్రబాబును భయపెట్టి, సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోయే విధంగా చేస్తున్నారా అనే సంశయం కూడా తెలుగుదేశం పార్టీ నేతలను పీడిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్టు వంటి వ్యక్తిగత విశ్వాసాలపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడరు. అయితే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మాత్రం తన బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణతో వాస్తు మార్పులు చేయించారు.
2014 ఎన్నికలకు ముందు ఆ వాస్తు మార్పులు జరిగాయి. ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. సచివాలయానికి వాస్తు దోషం ఉందనేది కొత్త విషయమేమీ కాదు. ఎన్టీ రామారావు హయాంలోనే అది ముందుకు వచ్చింది. గత చంద్రబాబు హయాంలో కూడా ఓ వాస్తు నిపుణుడు హెచ్చరిక చేశాడు. జలశయానికి ముందు సచివాలయం ఉండడం సరి కాదని ఆ నిపుణుడు చెప్పాడు. అయితే, ప్రతి ముఖ్యమంత్రి కూడా సచివాలయానికి వాస్తు సవరణలు చేశారు.