నేడు బెజవాడ దుర్గమ్మ సన్నిధికి...సిఎం కేసీఆర్ రాక
Recommended Video
విజయవాడ: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించనున్నారు. బేగంపేటనుంచి ప్రత్యేక విమానంలో ఆయన కుటుంబ సమేతంగా విజయవాడకు చేరుకుంటారు.
తెలంగాణ వస్తే బెజవాడ కనక దుర్గమ్మకు బంగారు ముక్కుపుడక సమర్పిస్తానని గతంలో మొక్కుకున్న కెసిఆర్ నేడు ఆ మొక్కును చెల్లించుకోనున్నారు. అమ్మవారికి సమర్పించే ముక్కుపుడకను ప్రత్యేకంగా తయారు చేయించారు. పాలపిట్టను చంద్రాకారంలో మలచి రూపొందించిన ఈ ముక్కుపుడకలో వజ్రాలు, పచ్చ రాళ్లు పొదిగి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
11.29 గ్రాముల బంగారంతో రూపొందించిన ఈ ముక్కుపుడకలో 3 వరసలుగా పొదిగిన 57 వజ్రాలు, చంద్రాకారం మధ్యలో చెట్టు కొమ్మ, కొమ్మపై కూర్చున్న రాష్ట్ర పక్షి పాలపిట్ట ఆకారంతో ముక్కుపుడకను రూపొందించారు. పాల పిట్ట ఈకలుగా నీలం రంగు రాళ్లు, చెట్టు కొమ్మలోని పచ్చని ఆకులుగా పచ్చ రాళ్లు పొదిగారు.
గురువారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి శోభ, కుమార్తె కవిత, కోడలు, మనవడితో కలసి విజయవాడకు చేరుకుంటారు. 12 గంటలకు విజయవాడ చేరుకోనున్న ఆయన...గం. 12.45 నిమిషాల సమయంలో ఆలయానికి వెళ్లి మొక్కు తీర్చుకుంటారని తెలిసింది. అనంతరం తిరిగి హైదరాబాద్ కు పయనమవుతారు. తెలంగాణా దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి బుధవారమే కుటుంబ సమేతంగా విజయవాడకు బయలుదేరి వెళ్లారు.