కెసిఆర్ దంపతుల సమక్షంలోనే పెళ్ళి, పరిటాలతో తెలంగాణ సిఎం ఇలా..
అనంతపురం: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తొలిసారిగా అనంతపురం జిల్లాలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో అనంతపురం జిల్లా వెంకటాపురానికి చేరుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ దంపతులను కెసిఆర్ ఆశీర్వదించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీరామ్ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిన అరగంటకు కెసిఆర్ వెంకటాపురం చేరుకొన్నారు.
వెంకటాపురంలో ఆదివారంనాడు పరిటాల శ్రీరామ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హజరయ్యారు.
ఏపీకి చెందిన పలువురు మంత్రులు వివాహ వేదికపైనే వివాహం జరుగుతున్నంతసేపు ఉన్నారు.పలు పార్టీలకు చెందిన నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు విఐపిలు పరిటాల శ్రీరామ్ వివాహనికి హజరయ్యారు. సినీ ప్రముఖులు కూడ హజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, భాస్కర్రావు కూడ ఉన్నారు. నూతన దంపతులను కెసిఆర్తో పాటు వారు ఆశీర్వదించారు.
తొలిసారిగా అనంతపురం జిల్లాకు కెసిఆర్
అనంతపురం జిల్లా వెంకటాపురంలో వైభవంగా జరిగిన పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ప్రొటోకాల్ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఉదయం 11.30 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరిన ఆయన, 12.20 గంటల సమయంలో పుట్టపర్తి చేరుకున్నారు. ఆ వెంటనే ఆయన హెలికాప్టర్లో వెంకటాపురం చేరుకొన్నారు.
పరిటాల రవితో స్నేహన్ని గుర్తుచేసుకొన్న కెసిఆర్
సింగనమల నియోజకవర్గం నార్పాల మండలం ఏబీఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఆళం వెంకటరమణ, సుశీలమ్మ కుమార్తె ఆళం జ్ఞానవేణితో శ్రీరామ్ వివాహం ఆదివారం నాడు జరిగింది. తమ కుమారుడి పెళ్లికి రావాలంటూ పరిటాల సునీత స్వయంగా కేసీఆర్ ను ఆహ్వానించగా, పరిటాల రవితో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు కెసిఆర్. పరిటాల సునీతతో పాటు శ్రీరామ్ వెళ్ళి కెసిఆర్ను ఆహ్వనించగానే ఆయన వివాహనికి హజరౌతానని హమీ ఇచ్చారు. వివాహనికి హజరయ్యారు.
కెసిఆర్ దంపతుల సమక్షంలో వివాహం జరిగేది
తన కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహనికి పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి ఏపీ మంత్రి పరిటాల సునీత ధన్యవాదాలు తెలిపారు.తాను పిలవగానే చంద్రబాబు, కేసీఆర్ లు వచ్చారని చెప్పారు. అమ్మాయి వివాహం అయి వుంటే కనుక కేసీఆర్ దంపతుల సమక్షంలోనే పెళ్లి జరిగి ఉండేదని పరిటాల సునీత చెప్పారు. తన భర్తకు, కేసీఆర్ కు మధ్య స్నేహబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారని పరిటాల సునీత.
నిండు మనస్సుతో ఆశీర్వదించాలని
తన బిడ్డ శ్రీరామ్, జ్ఞానలు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా జీవించి ఉండేలా మంచి మనసుతో ఆశీర్వదించాలని ఏపీ మంత్రి, దివంగత టీడీపీ నేత పరిటాల రవి సతీమణి సునీత, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లను కోరారు. వివాహ వేడుకకు ముందు మీడియాతో ఆమె మాట్లాడారు.అబ్బాయి వివాహం కావడంతో వారు వచ్చి ఆశీర్వదించి వెళ్లినా తనకు అమితమైన ఆనందమేనని వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసిన ఆమె, పెళ్లి ఏర్పాట్లకు కష్టపడిన ప్రతి కార్యకర్తకూ కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు వెళ్ళాక వెంకటాపురానికి కెసిఆర్
ఏపీ సీఎం చంద్రబాబు, తన వియ్యంకుడు, హీరో బాలకృష్ణ, పలువురు మంత్రులతో కలసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి వేదిక దిగి వెళ్లిపోయిన అరగంట తరువాత కేసీఆర్ వెంకటాపురం చేరుకున్నారు. ఆపై ప్రత్యేక కాన్వాయ్ లో వేదిక వద్దకు వచ్చారు.కేసీఆర్ ను చూడగానే, అక్కడున్న పరిటాల అభిమానులు పెద్దఎత్తున కేరింతలు కొట్టారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన కేసీఆర్, వారికి శుభాభినందనలు తెలిపి, అక్కడే కూర్చుని పలువురు ప్రముఖులతో మాటలు కలిపారు. కేసీఆర్ రాక సందర్భంగా వెంకటాపురంలో ఏపీ పోలీసులతో పాటు, తెలంగాణ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం తరువాత ఆయన తిరిగి పుట్టపర్తికి హెలికాప్టర్ లో వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.