నాయినికి కెసిఆర్ పరామర్శ: మంత్రులతో భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారంనాడు సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించారు. స్వల్ప అస్వస్థతకు గురై నాయని నర్సింహారెడ్డి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కెసిఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఇదిలావుంటే, శాసనసభ కార్యదర్శి రాజా సదారాం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావునను కలిశారు. అసెంబ్లీ సమావేశాలపై ఆయన ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ నెల 20వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో జెన్కో, బిహెచ్ఇఎల్ అధికారులు శనివారంనాడు సమావేశమయ్యారు. మణుగూరు, కొత్తగూడెం విద్యుత్తు ప్లాంట్ల ఎంఓయులపై వారు చర్చించినట్లు సమాచారం.
ఇదిలావుంటే, తన అధికారిక నివాసంలో కెసిఆర్ శనివారంనాడు మంత్రులు, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆబ్కారీ మంత్రి పద్మారావు, ఎంపి కె. కేశవ రావు, శానసభ్యుడు శ్రీనివాస గౌడ్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.