తొలిసారి ఓ సిఎం: పర్దా ప్యాలెస్కు కెసిఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదు రాజ్యం ఏడో నిజాం నివాసంగా వర్థిల్లిన కింగ్ కోఠి పర్దా ప్యాలెస్ విషయంలో చారిత్రక సంఘటన చోటు చేసుకుంది. కొన్ని దశాబ్దాల తర్వాత తొలిసారి ఓ ముఖ్యమంత్రి స్థాయి నేత పర్దా ప్యాలెస్లో అడుగుపెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్యాలెస్ను సందర్శించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యుడు కడియం శ్రీహరితో కలిసి ప్యాలెస్కు వెళ్లిన ఆయన పదిహేను నిమిషాల పాటు వాటిలోని గదులన్నింటిని పరిశీలించారు. మీడియాను మాత్రం గేట్ లోపలికి అనుమతించలేదు.
అనంతరం ఎర్రమంజిల్లోని రోడ్లు, భవనాల శాఖకు చెందిన (ఈఎన్సీ కార్యాలయం) భవన సముదాయాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ భవనాన్ని పరిశీలించారు. ఆయన వాటిని సందర్శించడంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఈ మధ్య ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే.
ఒక వేళ హైకోర్టును విభజించి, రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఏర్పాటు చేస్తే భవనాలు అవసరం కాబట్టి ఆయన ఫర్దా ప్యాలెస్ను, ఆర్ అండ్ బీ కార్యాలయాన్ని పరిశీలించారని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా మార్చాలని యోచిస్తున్న కెసిఆర్ అందుకు కూడా వాటిని సందర్శించి ఉండవచ్చునని ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ నగరంలోని మరికొన్ని భవనాలనూ పరిశీలించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆ త ర్వాతనే ఏ విషయమనేది స్పష్టత రానుంది.