హైదరాబాద్ బ్రాండ్ పెంచాలి: కెసిఆర్, బాబుకు ధీటుగా...
హైదరాబాద్: హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అధికారులను ఆదేశించారు. ఆయన జిహెచ్ఎంసి అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో చర్చించారు.
ముఖ్యంగా వర్షాకాలంలో నగరంలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలను అడిగి తెలుసుకున్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు. ఐటిఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటు నేపథ్యంలో 40 లక్షల మంది నగరానికి వస్తారని, దానికి అనుగుఅణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, డ్రెయినేజ్ సమస్యలు తలెత్తవద్దన్నారు.
తొలిసారి మంత్రిగా నియోజకవర్గానికి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మంత్రిగా తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చారు. చాకరిమెట్ల హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రాణహిత - చేవెళ్లను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.
టిడిపి చిల్లర రాజకీయం: కర్నె
కేసీఆర్ కేబినెట్ పైన టిడిపి చిల్లర రాజకీయాలు చేస్తోందని తెరాస నేత కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కేబినెట్ విస్తరణ మరోసారి ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. బిజెపి అగ్రనేతలతో తనకు ఉన్న పరిచయాలతో తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు తీసుకు వస్తానని మహబూ బ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబుకు ధీటుగా లాబీయింగ్ చేస్తామన్నారు. లోకసభలో పోలవరం ఆర్డినెన్స్ను అడ్డుకుంటామని చెప్పారు. తెలంగాణకు అన్యాయం చేస్తే ఎన్డీయేపై పోరాడుతామన్నారు.
కెసిఆర్ను కలిసిన టిటిడిపి నేతలు
కెసిఆర్ను తెలంగాణ టిడిపి నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావులు కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్కు అభినందనలు తెలియజేశామని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగించాలని కోరామని చెప్పారు. విద్యుత్, విత్తనాల పంపీణీ పైన చర్చించినట్లు చెప్పారు.
కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి తమకు ఆహ్వానం రాలేదని తలసాని తెలిపారు. ఈ విషయాన్ని కెసిఆర్ దృష్టికి స్వయంగా తీసుకెళ్లామన్నారు. కెసిఆర్కు తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి అభినందించారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సిఎంగా ఆయన ప్రమాణ స్వీకారానికి కెసిఆర్ను ఆహ్వానించినట్లు తెలిపారు.