హోదాకు మద్దతు తెలపకుంటే కేసీఆర్కు ఇబ్బందులు తప్పవు: టీజీ
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు పలకాలని డిమాండ్ చేశారు ఎంపీ టీజీ వెంకటేష్. లేదంటే కేసీఆర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రం విడిపోయే సమయంలో సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారని... ఇప్పుడు ఆ హామీని విస్మరిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని జోస్యం చెప్పారు.
ఏపీ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ భాగస్వామి కాకపోతే... కర్నాటక ఎన్నికల్లో ఎలా అయితే బీజేపీకి ఓటు వేయకూడదని తెలుగు వారికి పిలుపిచ్చామో... అదే మాదిరిగా రానున్న ఎన్నికల్లో తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్ర రాయలసీమ ప్రజలకు పిలుపివ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. నీతి ఆయోగ్ సమావేశానికంటే ముందే ప్రధాని మోడీని కేసీఆర్ కలిశారని...
ఆ తర్వాత సమావేశంలో ఏపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. మోడీ వలలో కేసీఆర్ పడకూడదని సూచించిన టీజీ వెంకటేష్... రానున్న ఎన్నికల్లో ఇరు తెలుగు రాష్ట్రాలు ఒకే తాటిపై వెళతాయన్న సంకేతాలు ఇవ్వకపోతే ఏపీకి తీరని అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే టీజీ వెంకటేష్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీ సీనియర్ నేత కేకే ఖండించారు. టీజీ వెంకటేష్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజీ బీరాలు పలికారని గుర్తు చేసిన కేకే... ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక తమ కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. టీజీ వెంకటేష్ ఒక పిచ్చోడని అభివర్ణించిన గులాబీ నేత... టీజీ మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.