బడ్జెట్పై సొంత నేతలకు అశోక్ ఝలక్: వాళ్లు కూడానా.. పవన్ కళ్యాణ్పై కేఈ తీవ్రవ్యాఖ్యలు
అమరావతి: యూనియన్ బడ్జెట్పై కేంద్రమంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు స్పందించేందుకు నిరాకరించారు. అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై టీడీపీ నేతలు అందరూ తీవ్రంగా మండిపడుతోన్న విషయం తెలిసిందే.
అయితే అశోక్ సోమవారం విజయనగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. బడ్జెట్ పైన స్పందించబోనని, దానిపై మాట్లాడడానికి ఇది సందర్భం కాదన్నారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కేంద్ర,రాష్ట్ర కమిటీలు కూడా అధ్యయనం చేస్తున్నాయన్నారు. ఓ విధంగా ఆయన సొంత పార్టీ నేతలకు షాకిచ్చారు.
వైసీపీపై ఘాటుగా
భోగాపురం ఎయిర్పోర్టు టెండర్ల రద్దు అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి తానే సలహా ఇచ్చానని అశోక్ తెలిపారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతల ఆరోపణలు అసత్యమన్నారు. బడ్జెట్ పైన మార్చి 31వ తేదీ వరకు వేచి చూడాలన్నారు. కేంద్రమంత్రులు రాజీనామా చేయాలన్న వైసీపీపై ఆయన ఘాటుగా స్పందించారు. తాము ప్రజల భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకుంటామన్నారు. చేతనయితే చేస్తామని, లేదంటే ఇంట్లో కూర్చుంటామని, కానీ అవినీతికి ఆస్కారం ఇవ్వమని జగన్ను ఉద్దేశించి అన్నారు.
సహనం పరీక్షించొద్దని బీజేపీకి కేఈ హెచ్చరిక
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ... తాము అసంతృప్తితో ఉన్నామని, వచ్చే నెల 5 వరకు వేచి చూస్తామని, తమ సహనాన్ని ఇంకా పరీక్షించవద్దని బీజేపీని హెచ్చరించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం జాతీయ అంశంగా మారిందని, తమకు న్యాయం చేయాల్సిందే అన్నారు.
పవన్ కళ్యాణ్ కమిటీపై తీవ్ర వ్యాఖ్యలు
అదే సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నిధుల లెక్కలపై కమిటీ ఏర్పాటు చేస్తామన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేఈ తీవ్రంగా స్పందించారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లు, చేయని వాళ్లు కమిటీలు ఏర్పాటు చేస్తామంటే ఏం మాట్లాడుతామని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఎవరితో అయినా కలుపుకొని పోతామని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు.
మోడీకి సాష్టాంగ నమస్కారం
వైసీపీపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం మండిపడ్డారు. మా ఎంపీలు ఏపీకి న్యాయం కోసం పోరాడుతుంటే వైసీపీ ఎంపీలు ప్రధాని కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ చేసేది పాదయాత్ర కాదని, షికారు అన్నారు.
జగన్ ఫ్యామిలీకి ట్యూషన్ అవసరం
ఏపీలో టీడీపీయే ప్రభుత్వ, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయని సోమిరెడ్డి అన్నారు. మోడీకి వైసీపీ నేతలు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులు చట్టం తెలుసుకునేందుకు ట్యూషన్ చెప్పించుకోవాలన్నారు.