ఏం చెప్తారో?: పవన్ కాకినాడ సభపై కేఈ ఆతురత, జగన్పై తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే దీనికి మరింత బలం చేకూరుతోంది.
హోదాపై పవన్ కళ్యాణ్ తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నాటి నుంచి పలుమార్లు మీడియా ముందుకొచ్చిన కేఈ పవన్పై స్పందించారు. తిరుపతి సభ అనంతరం ఏపీకి హోదా వచ్చేంత వరకూ పోరాటం చేస్తామని, తమ పోరాటం ఒక్క రోజుతో ఆగేది కాదని అన్నారు.
పవన్ ‘సీమాంధ్ర ఆత్మగౌరవ సభ'పై కేఈ
అంతేకాదు తాము సంవత్సరానికి ఒకసారి వేదికపైకి ఎక్కి హోదా గురించి మాట్లాడి మరో ఏడాది పాటు కనిపించకుండా పోయే రకాన్ని కాదని కూడా గతంలో వ్యాఖ్యానించారు. కాగా, శుక్రవారం ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాకినాడలోని జేఎన్టీయూ క్రికెట్ గ్రౌండ్స్లో ‘సీమాంధ్ర ఆత్మగౌరవ సభ'ను నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ లాబీలో మీడియాతో కేఈ
ఈ క్రమంలో శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడిన సమయంలో కేఈ అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేఈ పవన్ కాకినాడ సభలో ఏం మాట్లాడతారో వేచి చూడాలి అని ఆతురతతో అన్నారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమతమని అన్నారు.
చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని కేఈ చెప్పుకొచ్చారు. రాబోయే రెండు మూడు ఏళ్లు రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన సమయమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని తెలిసినా కూడా జగన్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రాభివృద్ధిని జగన్ అడుగడుగునా అడ్డుకుంటున్నారు
రాబోయే రెండున్నరేళ్లలో విభజన హామీలన్నీ అమలవుతాయని ఆశిస్తున్నామని అన్నారు. రాష్ట్రాభివృద్ధిని జగన్ అడుగడుగునా అడ్డుకుంటున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రతి అంశాన్ని కూలంకుశంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారని కేఈ స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో విషయంలో ప్రజలంతా చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే, కేంద్రం రాయలసీమతో సహా వెనుకబడిన జిల్లాలకు 1500 కోట్ల ప్యాకేజీని ఇస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు.