ఎన్టీఆర్లా కాదు, అందుకే రావట్లేదు: చంద్రబాబుపై కేఈ సంచలనం, వివరణ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు పైన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు పైన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్లా ముఖ్యమంత్రి చంద్రబాబు ముక్కుసూటి మనిషి కాదని, అన్నింటికి చూద్దాం.. చేద్దాం అంటూ ఆలోచించే మనిషి అన్నారు.
కర్నూలు జిల్లా పర్యటనకు వస్తే ఏం అడుగుతారోనని ఆలోచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. గతంలో తాను ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా నాలుగున్నరేళ్ల పాటు పని చేశానని, ఆనకు సన్నిహితంగా ఉండి జిల్లాకు కావాల్సిన పనులు చేయించుకున్నానని చెప్పారు.
ప్రస్తుతం చంద్రబాబును జిల్లా అభివృద్ధి గురించి ఏమైనా అడిగితే ఆలోచిద్దాం, కొత్త రాష్ట్రం కదా అంటున్నారని, నిధుల కొరత ఉందని చెబుతున్నారని కేఈ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు: జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వెనుక..!
జిల్లాకు ఇప్పటికే పలు అభివృద్ధి పనులు మంజూరైనా జిల్లాకు వస్తే మళ్లీ ఏం అడుగుతారోనని సీఎం అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దాదాపు ఏడు పరిశ్రమలు మంజూరైనా ప్రారంభోత్సవాలు చేద్దామంటే సీఎం స్పందించటం లేదని, ఈ విషయాలన్నీ ఎంపీ టీజీ వెంకటేష్కే తెలియాలన్నారు.
వివరణ ఇచ్చిన కేఈ
తాను చేసినట్లుగా వచ్చిన వార్తల పైన కేఈ కృష్ణమూర్తి ఆదివారం నాడు వివరణ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందునే అభివృద్ధిలో జాప్యం జరుగుతోందని అన్నారు. సీఎం చొరవతోనే రాష్ట్రానికి ఏడు పరిశ్రమలు, సోలార్ పార్క్ వచ్చిందన్నారు.