'వైసీపీ గెలిచిన రాయలసీమలోనే వర్షాల్లేవ్.. కోస్తాలో కురిశాయి..'
కోస్తాంధ్ర జిల్లాల్లో సమృద్దిగా వర్షాలు కురిశాయని, వైసీపీ గెలిచిన రాయలసీమలోనే వర్షాలు కురవలేదని కేఈ విమర్శించారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుకు కరువుకు ముడిపెట్టి మాట్లాడుతున్న ప్రతిపక్ష వైసీపీ తీరును డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తప్పుబట్టారు. సీఎం చంద్రబాబు వల్లే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పడం వైసీపీ అధినేత జగన్ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.
సీఎంపై విమర్శలు చేస్తూ జగన్ ఓ అజ్ఞానిలా వ్యవహరిస్తున్నారని కేఈ ఎద్దేవా చేశారు. కోస్తాంధ్ర జిల్లాల్లో సమృద్దిగా వర్షాలు కురిశాయని, వైసీపీ గెలిచిన రాయలసీమలోనే వర్షాలు కురవలేదని కేఈ విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తల్లి, పిల్ల కాంగ్రెస్ లకు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారో? ఎన్నింటిని పూర్తి చేశారో వెల్లడించాలంటూ సవాల్ విసిరారు.
చంద్రబాబు కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే: ఎమ్మెల్సీ సతీష్
టీడీపీ పార్టీకి గానీ.. అధినేత చంద్రబాబుకు గానీ మచ్చ తెచ్చే పనులు తానెన్నడూ చేయబోనని ఎమ్మెల్సీ సతీష్ అన్నారు. పార్టీ కోసం, చంద్రబాబు గెలుపు కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్దమేనని ప్రకటించారు.
కాగా, రెండురోజుల క్రితం సూర్యలంక బీచ్ లోని హరిత రిసార్ట్స్ మేనేజర్ శ్రీనివాస్ తో పాటు అక్కడున్న సిబ్బందిపై సతీష్ దాడి చేశారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రిసార్ట్స్ మేనేజర్ ఫిర్యాదుతో బాపట్ల పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది.
ఇప్పటిదాకా దీనిపై మౌనం వహిస్తూ వచ్చిన ఎమ్మెల్సీ సతీష్ తాజాగా నోరు విప్పారు. తప్పు చేసినవారిని మందలించినందుకు తనపై కుట్రపన్ని తప్పుడు కేసు పెట్టారని ఈ సందర్బంగా ఆయన ఆరోపించారు.
పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న భావనతోనే తాను సైలెంట్ గా ఉన్నానని, కానీ ఎదుటివారు చేస్తున్న విమర్శలను చూస్తుంటే.. స్పందించక తప్పలేదని పేర్కొన్నారు.