నాకెవరూ చెప్పలేదు: కోట్ల చేరికపై కేఈ కినుక, చంద్రబాబుపై అసహనం! 'రాష్ట్రమంతా ప్రభావం'
కర్నూలు: కాంగ్రెస్ పార్టీ కర్నూలు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నారు. ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి టీడీపీలో చేరికపై చర్చించనున్నారు.
తెలుగుదేశం పార్టీలో చేరితే కర్నూలు లోకసభ, డోన్, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని (అంటే తన వారికి) కోట్ల టీడీపీ అధినేతకు ఇప్పటికే తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు రాత్రి చంద్రబాబును కలిసి టీడీపీలో చేరికపై నిర్ణయం తీసుకోనున్నారని చెబుతున్నారు. దీనిపై టీడీపీ నేతలు స్పందించారు.
కలిసివెళ్దాం రండి: జగన్-బాబులకు పవన్ కళ్యాణ్ కొత్త ఆఫర్, నాదెండ్ల-తోట పోటీ ఎక్కడి నుండి అంటే?
కేఈ కృష్ణమూర్తి కినుక
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడంపై ఉప ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జిల్లా సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి కినుక వహించినట్లుగా తెలుస్తోంది. ఈ చేరికపై ఆయన అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. కోట్ల - చంద్రబాబు భేటీపై కేఈ స్పందిస్తూ... కోట్ల చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఈ విషయమై తనతో ఎవరు కూడా సంప్రదించలేదని చెప్పారు. తనకు సమాచారం ఇచ్చారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఓ విధంగా ఆయన అధినేతపై అసహనంతో ఉన్నారని అంటున్నారు.
రాష్ట్రమంతా ప్రభావం
తమ పార్టీలోకి కోట్ల వస్తుండటంపై టీడీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన చేరికను స్వాగతిస్తున్నామన్నారు. కోట్ల కేంద్రమంత్రిగా పని చేశారని, ఆయన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేశారని, కాబట్టి ఆయన చేరిక ప్రభావం ఏపీ వ్యాప్తంగా ఉంటుందన్నారు. ఆయన రాకతో తెలుగుదేశం మరింత బలపడుతుందని చెప్పారు. బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుల రాజకీయాలను ప్రజలు నమ్మరన్నారు. ఒకే కుటుంబంలో బీజేపీ, వైసీపీలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.
చంద్రబాబుతో నేడు భేటీ
కాగా, కోట్ల టీడీపీలో చేరనున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్ అనుబంధ సంస్థల నాయకులు మూకుమ్మడిగా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కోట్ల పార్టీ మారుతున్నారన్న సమాచారంతో కర్నూలులోని ఆయన నివాసం వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. కోట్ల ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. కోట్ల కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి భోజనానికి ఆహ్వానించారని చెబుతున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో అమరావతి బయలుదేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనతో భేటీ కానున్నారు. ఈభేటీకి తన సతీమణి సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్రను కోట్ల తీసుకెళ్తున్నారని తెలుస్తోంది.