ఆ పదవులు టీడీపీకి రావడంలో చక్రం: ఎవరీ కేఈ ప్రభాకర్? నీ ఇష్టం.. గౌరుకు ఘాటుగానే జగన్
కర్నూలు: కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం జిల్లా నేతలతో రెండుమూడుసార్లు భేటీ అయ్యాక సీఎం చంద్రబాబు ఈయన పేరును ఖరారు చేశారు.
చదవండి: కేఈ ప్రభాకర్ టిక్కెట్ కోసం కృష్ణమూర్తి ఏం చేశారంటే? జగన్కు అఖిల సహా వారి దెబ్బ
కేఈ ప్రభాకర్ అభ్యర్థిత్వం కోసం సోదరుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. పార్టీలో ఆయన సేవలను గుర్తించే పగ్గాలు అప్పగించినట్లు జిల్లా నేతలు చెబుతున్నారు. 24న చంద్రబాబు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోని ఇంచార్జులు, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నారు. కేఈ కూడా మద్దతు కూడగట్టుకున్నారు.
చదవండి: జగన్కు బాబు ఊహించని ట్విస్ట్! ఎమ్మెల్సీ అభ్యర్థి కేఈ, ఏరుకున్నారు.. శిల్పా సంచలన వ్యాఖ్య
ఆ పదవులు దక్కడంలో కేఈ ప్రభాకర్ కీలక పాత్ర
కేఈ ప్రభాకర్ పార్టీకి చేసిన సేవలకు తోడు ఇటీవల ఆయన జిల్లాలో కీలక పదవులు టీడీపీకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇది కూడా ఆయనకు ప్లస్ అయింది. జెడ్పీ ఎన్నికలతో పాటు కేడీసీసీ చైర్మన్ పదవి టీడీపీకి దక్కడంలో ఆయన కీలక పాత్ర పోషించడం కూడా అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపడానికి కారణంగా చెబుతున్నారు.
కేఈ ప్రభాకర్ రాజకీయ రంగ ప్రవేశం ఇలా
కేఈ ప్రభాకర్ 1994లో జెడ్పీటీసీ సభ్యుడిగా కృష్ణగిరి నుంచి స్వతంత్రంగా పోటీ చేశారు. ఆ ఏడాదే డోన్ ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 1999లో మరోసారి గెలుపొందారు. 1995 నుంచి తొమ్మిదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ చేతిలో దాదాపు రెండువేల లోపు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 2009లో పత్తికొండ నుంచి టీడీపీ తరఫున గెలిచారు. 2014 కుల సమీకరణాలతో వాల్మీకులకు ఇచ్చారు.
ఇటీవలే ఐడీసీ చైర్మన్ పదవి, అనూహ్యంగా ఇప్పుడు ఇలా
2014లో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోడవంతో అప్పుడే ఆయన తనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబును అడిగారు. ఈ ఏడాది జూలై నెలలో ఆయనను ఐడీసీ చైర్మన్గా చంద్రబాబు నియమించారు. అయితే అనుకోకుండా శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీని వీడటంతో ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో కేఈకి అవకాశమిచ్చారు.
గౌరుకు జగన్ ఘాటుగానే చెప్పారా?
ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ పార్టీ నేత గౌరు వెంకట రెడ్డి పోటీకి ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. జగన్ను కలిసి తాను పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు కూడా తెలిపారు. కానీ ఆ సమయంలో జగన్ కూడా ఆయనకు ఒకింత ఘాటుగానే చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. పార్టీ నిర్ణయం తీసుకుందని, మీరు స్వతంత్రంగా పోటీ చేస్తే పార్టీ మద్దతు మాత్రం ఉండదని, వ్యక్తిగతంగా పోటీ చేస్తే చెయ్, ఆ తర్వాత మీ ఇష్టమనే ధోరణిలో చెప్పారని అంటున్నారు. జగన్ హామీ ఇవ్వకపోవడంతో గౌరు తగ్గిన విషయం తెలిసిందే. మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు అనవసర ఖర్చు, దానికి తోడు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరడం వంటి కారణాలతో వైసీపీ తప్పుకుంది.
వైసీపీకి పారిపోవడమే తెలుసా అని టిడిపి
ప్రతిపక్ష పాత్రను పోషించడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని అందుకే ఆ పార్టీ కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయిందని ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యమంటే జగన్, ఆ పార్టీ నాయకులకు తెలుసా అని ప్రశ్నించారు. పోటీ చేయకుండా పారిపోయిన వైసీపీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. వైసీపీ దృష్టిలో పారిపోవడమే ప్రజాస్వామ్యమా అని నిలదీశారు. అసెంబ్లీలోను పారిపోయిందన్నారు.
వైసీపీది దివాళాకోరుతనం, అడ్రస్ కూడా ఉండదు
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము గెలుపు తమదేనని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోను టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడం దివాళాకోరుతనానికి నిదర్శనం అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. కర్నులులో తాము 271 ఓట్ల ముందంజలో ఉన్నామని, పోటీలో ఎవరు ఉన్నా లేకున్నా గెలుపు తమదేనని కాల్వ శ్రీనివాసులు అన్నారు.