బైరెడ్డిని కలిసిన కేఈ, వైసీపీ కోసం పావులు: వాళ్లే మార్చేశారు, జగన్ ఏం చేస్తారు?
కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కేఈ ప్రభాకర్ బుధవారం రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డిని కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కేఈతో సహా నలుగురు నామినేషన్లు వేయగా, ఒక నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.
చదవండి: ఆ పదవులు టీడీపీకి రావడంలో చక్రం: ఎవరీ కేఈ ప్రభాకర్? నీ ఇష్టం.. గౌరుకు ఘాటుగానే జగన్
ఇండిపెండెంట్లుగా బైరెడ్డి అనుచరుడు పుల్యాల నాగిరెడ్డి, పులి జయప్రకాశ్ రెడ్డిలు నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ పోటీ నుంచి తప్పుకుంది. కానీ బైరెడ్డి వర్గం రూపంలో కేఈకి షాక్ తగిలింది. దీంతో ఆయనను కలిసి మద్దతు కోరారు. జనవరి 12న పోలింగ్, 16న కౌంటింగ్ జరగనుంది.
చదవండి: మమ్మల్ని లెక్క చేయరు, చేతులు ఎత్తాలి: మోడీపై జేసీ దివాకర్ రెడ్డి
చంద్రబాబుకు కానుకగా
అందరి మద్దుతుతో విజయం సాధిస్తానని కేఈ ప్రభాకర్ చెబుతున్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు అభివృద్ధిని ఆకాంక్షించే వారంతా మద్దతు తెలపాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో గతంలో తొమ్మిదేళ్లపాటు మంత్రిగా పని చేశానని గుర్తు చేశారు. నమ్మకమైన వ్యక్తిగా పార్టీలో ఉన్నానని, తప్పక విజయం సాధించి సీఎంకు కానుకగా ఇస్తానని చెప్పారు.
బైరెడ్డిని కలిసి తప్పుకోవాలని విజ్ఞప్తి
మరో ఇద్దరు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ కేఈ గెలుపు లాంచనమే. ఈ నెల 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. కేఈ బుధవారం బైరెడ్డిని కలిసి వారి నాయకుడిని బరి నుంచి తప్పుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ ఎవరికి మద్దతిస్తునేది ఆసక్తిగా మారింది. బైరెడ్డి వర్గీయులు బరి నుంచి తప్పుకుంటే ఏకగ్రీవం అవుతుంది. లేదంటే పోలింగ్ జరగనుంది.
అలా టీడీపీ బలం పెరిగింది
ఓటర్ల జాబితా ప్రకారం 1,079 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో టీడీపీకి 660 ఓట్ల బలం ఉండగా, వైసీపీకి 359, స్వతంత్రులు 60 ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐతే ఏకగ్రీవం అని, లేకపోతే అత్యధిక మెజార్టీతో గెలుపు సొంతం చేసుకుంటామని టీడీపీ చెబుతోంది. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అప్పటి ఓట్లు 1,084లో టీడీపీ 480, వైసీపీ 511, ఇతరులు 93 ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, నాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మణిగాంధీలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో సమీకరణాలు మారి టీడీపీ బలం పెరిగింది. వైసీపీ నుంచి వీరి చేరడమే ఇప్పుడు సమీకరణాలు మారడానికి కారణం.
వైసీపీ ఓటర్లపై టీడీపీ పావులు
ప్రస్తుతం వైసీపీ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను సైతం టీడీపీ వైపులాగే అవకాశముంది. స్వతంత్ర ఓటర్లలో మరికొందరు సహకరించినా టీడీపీ అత్యధిక భారీ మెజార్టీతో గెలుస్తుంది. అందుకోసం పావులు కదుపుతోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఓటర్లను ఇంచార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులతో కలిసి నేతలు కలిసి పూర్తి గెలుపుకు వ్యూహాలు రచిస్తున్నారు.
వైసీపీ ఎటు, ఎటూ మద్దతివ్వకపోవచ్చు
స్వతంత్రులు బరిలో నిలిస్తే వైయస్సార్ కాంగ్రెస్ ఎవరికి మద్దుతు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ చివరికి స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇచ్చే పరిస్థితికి రాదని, తొందరపాటు నిర్ణయం జరగదని అంటున్నారు. ఎటూ మద్దతివ్వకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.