కేఈ ప్రభాకర్ టిక్కెట్ కోసం కృష్ణమూర్తి ఏం చేశారంటే? జగన్కు అఖిల సహా వారి దెబ్బ
అమరావతి/కర్నూలు: నంద్యాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కేఈ ప్రభాకర్ను బరిలోకి దింపింది. ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ బీఎస్పీ నుంచి ఒకరి, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు బరిలో దిగారు.
స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరులు. స్వతంత్రులు పోటీలో నిలవడంతో వైసీపీ ఇతరులకు ఎవరికైనా మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉండగా, తన సోదరుడు కేఈ ప్రభాకర్ వైపు అధిష్టానం మొగ్గు చూపడానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్ర ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది.
జగన్కు బాబు ఊహించని ట్విస్ట్! ఎమ్మెల్సీ అభ్యర్థి కేఈ, ఏరుకున్నారు.. శిల్పా సంచలన వ్యాఖ్య
కేఈ కృష్ణమూర్తి ప్రయత్నాలు ఫలించాయి
కేఈ ప్రభాకర్ అభ్యర్థిత్వం ఖరారు కావడానికి కేఈ కృష్ణమూర్తి చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని అంటున్నారు. తన సోదరుడికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వద్ద ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ నెల 16వ తేదీన జిల్లా నేతలతో చంద్రబాబు జరిపిన భేటీలో అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయం కోసం కృషి చేయాలని జిల్లా నేతలకు సూచించారు.
Recommended Video
అందరికీ ఫోన్లు చేసి మద్దతు కూడగట్టారు
ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఓ వైపు తన సోదరుడి గురించి చెబుతూ, మరోవైపు జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జులు, ముఖ్య నాయకులకు ఫోన్లు చేసి కేఈ కృష్ణమూర్తి మద్దతు కూడగట్టారని తెలుస్తోంది. లోకేష్ సహా యువ నాయకుల మద్దతును కూడా సంపాదించారని అంటున్నారు.
చంద్రబాబు వద్ద కేఈ పట్టు
గత రెండు పర్యాయాలు నంద్యాల పార్లమెంటు పరిధిలోని వారికి ఇచ్చారని, ఈసారి కర్నూలు నుంచి ఇవ్వాలని, అలాగే, బీసీలకు ఈసారి అవకాశమివ్వాలని కేఈ తొలి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇటీవల నంద్యాలకు చెందిన ఎన్ఎండి ఫరూక్కు ఇచ్చారని గుర్తు చేశారు. ఈసారి తమ వైపు ఇవ్వాలని ఆయన చంద్రబాబు వద్ద గట్టిగా పట్టుబట్టారు.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా
2014 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కేఈ ప్రభాకర్ ఆశిస్తే సామాజిక సమీకరణాల నేపథ్యంలో వాల్మికీ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడుకు ఇచ్చారని, ఆ తర్వాత రాజ్యసభను టీజీ వెంకటేష్కు ఇచ్చారని, అందువల్ల తన సోదరుడికి టిక్కెట్ ఇవ్వాలని కృష్ణమూర్తి అధినేతను కోరారు. చంద్రబాబు కూడా కేఈ వైపు మొగ్గు చూపారని, కానీ అందరి మద్దతు కూడకట్టేందుకు సమయం తీసుకున్నారని, అలాగే వైసీపీని వ్యూహాత్మకంగా కార్నర్ చేసేందుకు కూడా మౌనం వహించారని, చివరి నిమిషంలో కేఈకి ఇచ్చారని అంటున్నారు.
ఎవరి బలం ఎంత?
ఎన్నికల కోసం.. ఈ నెల 20వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను కలిసి ఇంచార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా నేతలు మాట్లాడారు. 2014 ఎన్నికల అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకున్న అఖిలప్రియ, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు పార్టీ మారారు. ఈ సమీకరణాలతో మొత్తం 1079 ఓట్లలో టీడీపీ బలం 660 ఓట్లకు పైగా ఉన్నట్లు అధినేత దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీకి 359 ఓట్లు ఉండగా, స్వతంత్రులు 60 ఓట్లు ఉండచ్చని భావిస్తున్నారు. తమ ప్రజాప్రతినిధులు పార్టీ మారినందువల్ల తాము ఓడిపోతామని భావించే వైసీపీ వెనక్కి తగ్గిందని అంటున్నారు.