లెక్క చెప్పండి: ఏఏపీకి ఐటీ నోటీసు, మీరంతా రండి: రేడియోలో కేజ్రీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఇటీవల అవమ్ అనే స్వచ్చంధ సంస్థ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ పైన తీవ్ర అవినీతి ఆరోపణలు చేసింది. పార్టీకి వచ్చిన విరాళాల పైన ఆరోపణలు గుప్పించింది. దీనిపై ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో ఐటీ శాఖ ఏఏపీకి నోటీసులు జారీ చేసింది. రెండు కోట్ల విరాళాల పైన 16వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సూచించింది. మరోవైపు కేజ్రీవాల్ తన ప్రమాణ స్వీకారానికి అందర్నీ పిలిచే పనిలో పడ్డారు. మరోవైపు, ఓ పరువు నష్టం దావా కేసులో కేజ్రీవాల్కు వ్యక్తిగత హాజరు నుండి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి ఐటీ శాఖ నోటీసుల పైన కాంగ్రెస్ స్పందించింది. రాజకీయ దురుద్దేశ్యంతో ఏఏపీకి నోటీసులు ఇచ్చారని ఆరోపించింది. దీనిపై బీజేపీ స్పందిస్తూ.. దీనిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పింది.
రేడియోలో ప్రజలకు కేజ్రీ ధన్యవాదాలు
ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ రేడియోలో ధన్యవాదాలు తెలిపారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రజలను ఆహ్వానించారు. సీఎంగా తానొక్కడినే ప్రమాణ స్వీకారం చేయడం లేదని, మీరంతా కూడా అన్నారు. ప్రమాణ స్వీకారానికి రావడం మీ హక్కు అన్నారు. నిర్ణయాత్మక తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
వెంకయ్యతో కేజ్రీ భేటీ... ఢిల్లీకి పూర్తి రాష్ట్ర స్థాయి హోదా కోసం అభ్యర్థన
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడితో కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వెంకయ్య అభినందనలు తెలిపారు. అనంతరం ఏఏపీ నేత మనీష్ సిసోడియా మాట్లాడారు. ఢిల్లీ అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి సహాయం అర్థించామన్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అనధికార కాలనీలను క్రమబద్దీకరించాలని కోరామని, స్కూలు, కాలేజీ స్థలాల పైన కూడా చర్చించామన్నారు. ఇది మర్యాదపూర్వక భేటీయే అన్నారు.
రేపు మోడీతో కేజ్రీవాల్ భేటీ
కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీని రేపు ఉదయం పదిన్నర గంటలకు కలవనున్నారు. ఈ నెల 14వ తేదీన రాంలీలా మైదానంలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయననున్నారు. ఈ నేపథ్యంలో మోడీని కలిసి ఆహ్వానించనున్నారు.