సిఐడికి కేశవ రెడ్డి కేసు అప్పగింత, ఇంజెక్షన్ సైకోని పట్టుకుంటాం: డిజిపి
హైదరాబాద్: కేశవ రెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవ రెడ్డి పైన కేసులను సిఐడికి అప్పగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడు శుక్రవారం నాడు తెలిపారు. ఆయన సాయంత్రం సిఐడి అధికారులతో సమావేశం కానున్నారు. కేసు విషయమై చర్చిస్తారు.
శుక్రవారం మధ్యాహ్నం కర్నూలు కర్నూలు నగరంలో రాయలసీమ జిల్లాల అధికారులతో డిజిపి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేశవ రెడ్డి పైన కేసులు, శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. కేశవ రెడ్డి పైన ఐదు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. త్వరలోనే సిఐడికి బదలీ చేస్తామన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా చాలా వరకు అరికట్టినట్లు చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించిన ఇరవై అయిదు మంది పోలీసులు, ఉన్నతాధికారులకు అవార్డులు, రివార్డులు ఇచ్చారు.
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని త్వరలోనే స్వదేశానికి తీసుకు వస్తామని డిజిపి చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తులను జఫ్తు చేస్తామని చెప్పారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సూది సైకోను త్వరలోనే పట్టుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.