జోకర్లు ఆరోపిస్తున్నారు: పవన్పై పరోక్షంగా కెకె
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితిదేనని రాజ్యసభ సభ్యులు, ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు అన్నారు. తెలగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంత బలంతోనే టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం, కేంద్రంలో టిఆర్ఎస్ కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. సీమాంధ్ర పార్టీలు టిఆర్ఎస్పై ఎంతగా తప్పుడు ప్రచారం చేసినా, ఆ పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా జనం ప్రజలు టిఆర్ఎస్కే ఓటు వేశారని కేశవరావుఅన్నారు.
ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని ఏరులై పారించిన వారిపై ఎన్నికల కమిషన్ తగు చర్య తీసుకోవాలని కేశవరావు డిమాండ్ చేశారు. పేరు చెప్పలేనని చెప్పిన ఆయన, జోకరులాంటి కొందరు వ్యక్తులు టిఆర్ఎస్పై బురద జల్లుతూ, అనవసర ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కెకె వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య విద్వేషాలు రేపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
సీమాంధ్ర రాజకీయ నాయకులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇలా మాట్లాడుతున్న నాయకులపై చర్య తీసుకోవలసిన బాధ్యత గవర్నర్పైన, ఎన్నికల కమిషన్పైన ఉందని అన్నారు. తాము ఇరుప్రాంతాల ప్రజలు అన్నదమ్ముల్లా ఉండాలని కోరుకుంటున్నామని, సీమాంధ్రలో సభలు పెట్టిన రాజకీయ నాయకులు టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కెకె హెచ్చరించారు.
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రచారం చేసుకున్న స్థాయిలో బిజెపికి సీట్లు రావని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని, ఎన్నికల తరువాత ఢిల్లీలో టిఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. జాతీయ స్థాయి నాయకులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఫలితాలు వెలువడిన తరువాత ఈ అంశంపై స్పష్టత ఏర్పడుతుందని తెలిపారు.