కొత్త స్కీంతో రూ.547 కోట్ల మోసం: ఇదీ కేశవ రెడ్డి ప్రస్థానం (పిక్చర్స్)
కర్నూలు: కేశవ రెడ్డి విద్యా సంస్థల చైర్మన్ కేశవ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలు, చట్టాలకు విరుద్ధంగా తల్లిదండ్రులు, ప్రయివేటు వ్యక్తుల నుంచి కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించి, వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని అందిన ఫిర్యాదుల నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ కేశవ రెడ్డి ప్రస్థానం...
కేశవ రెడ్డి సాధారణ ఉపాధ్యాయుడిగా ప్రస్థానం మొదలు పెట్టారు. ఇప్పుడు కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేతగా ఎదిగారు. కేశవ రెడ్డి మొదట్లో ఆళ్లగడ్డలోని సరస్వతీ విద్యా పీఠం పాఠశాలలో ఉపాధ్యాయుడు. ప్రధానోపాధ్యాయుడుగా జీవితాన్ని ప్రారంభించాడు.
అనంతరం నంద్యాలకు వలస వచ్చాడు. ఇరవై రెండేళ్ల క్రితం.. అంటే 1993లో సంజీవ్ నగర్లో అద్దె భవనంలో పాఠశాలను ప్రారంభించాడు. పాఠశాల ప్రారంభించిన మూడేళ్ల తరవాత నుంచి డిపాజిట్ల సేకరణ విధానాన్ని ప్రారంభించాడు.
2000లో మొదటిసారిగా నంద్యాలలో సొంత భవనంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. 2002లో పాణ్యం మండలం నెరవాడ వద్ద పెద్ద భవనం నిర్మించి, రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా కేంద్రంలో నాలుగు శాఖలను ఏర్పాటు చేశారు.
కేశవ రెడ్డి
తాను ఎవరినీ మోసం చేయదల్చుకోలేదని, స్థిరాస్థి వ్యాపారం కోసం భూములు కొన్నానని కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవ రెడ్డి గురువారం నాడు చెప్పారు. ప్రస్తుతం వాటి విలువ చాలా తక్కువగా ఉందని చెప్పారు.
కేశవ రెడ్డి
ఏడాది సమయం ఇస్తే తాను ఆస్తులను అమ్మి అందరి డబ్బులు చెల్లిస్తానని చెప్పారు. ప్రభుత్వం తన భూములను స్వాధీనం చేసుకొని డబ్బులు చెల్లించినా అభ్యంతరం లేదన్నారు. తనకు మోసం చేయాలనే మనస్తత్వమే ఉంటే సంవత్సరం నుంచి సమస్యను పరిష్కరించాలని ఎందుకు చూస్తానన్నారు.
కేశవ రెడ్డి
ప్రభుత్వం తన ఆస్తులు తీసుకుంటానంటే ఇచ్చేందుకు నేను సిద్ధమని చెప్పారు. మంచి ఉద్దేశ్యంతోనే డిపాజిట్లు సేకరించానని, మోసం చేసే ఉద్దేశ్యం తనకు లేదన్నారు.
కేశవ రెడ్డి
మోసం చేయాలనుకుంటే ఐపీ పెట్టేవాడినని చెప్పారు. ఏడాది ఆగితే అందరికీ అన్నీ చెల్లిస్తానని చెప్పారు. ఈ తప్పంతా నేనే చేశానని చెప్పారు. ఇందులో ఎవరికి పాత్ర లేదన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 53 శాఖలు ఉన్నాయి. ఇందులో 23 సొంత భవనాలు. సుమారు 11వేల మంది విద్యార్థులు ఉన్నారు. డిపాజిట్ డబ్బులకు కేశవ రెడ్డి రూ.3 నుంచి రూ.6 వరకు వడ్డీ చెల్లిస్తుండటంతో పెద్ద మొత్తంలో రుణాలు వచ్చాయి.
మరోవైపు కేశవ రెడ్డి తన ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రూ.62 కోట్లు తీసుకున్నారు. తీసుకున్న అప్పులు చెల్లించడంలో విఫలమయ్యారు. మొత్తంగా రూ.547 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు వారు చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.