కేశినేని నానీ , దేవినేని ఉమా ఉప్పు, నిప్పు అనుకుంటే పప్పులో కాలేసినట్టే .. అసలేం జరిగిందంటే
తెలుగుదేశం పార్టీలో టెన్షన్ పుట్టిస్తున్న కేశినేని నానీ సొంత పార్టీ నేతలపైనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబే బుజగించే యత్నం చేసినా ససేమిరా అన్న నానీ సోషల్ మీడియా వేదికగా తాను చెప్పదలుచుకున్న విషయాలు చెప్పారు. దేవినేనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నానీ దేవినేని కలిస్తే ఏం చేశారో తెలుసా
టీడీపీపై, దేవినేని పై కేశినేని నానీ అసహనం .. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు
సొంత పార్టీపైనే పోరాటం చేస్తున్న నానీ మొదట గల్లా కుటుంబంపై కన్నెర్ర చేశారు. ఆ కుటుంబానికి రెండు పదవులు ఎందుకని ప్రశ్నించారు. గల్లా అరుణకుమారి పొలిట్ బ్యూరో మెంబర్గాఉన్నారు. గల్లా జయదేవ్కు పార్లమెంటరీ పార్టీ నేత పదవి ఇచ్చారు. అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ కోణంలో కేశినేని విమర్శలు చేశారు. పార్టీ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తర్వాత ఆయన మాజీమంత్రి దేవినేని ఉమాపై వ్యాఖ్యలు చేసి ఆయన మనసులో ఉన్న బాధను బహిర్గతం చేశారు .విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనుకున్నా దేవినేని ఉమా జిల్లా మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారన్న భావన కేశినేని నానీకి ఉంది. ఇక చంద్రబాబు సైతం దేవినేనికి ఇచ్చిన ప్రాధాన్యత కేశినేనికి ఇవ్వకపోవటం కూడా నానీ అసహనానికి కారణం.
తన పోస్ట్ తో కొడాలి నానీకి దేవినేని ఉమాకు మధ్య ఉన్న పాత ఘర్షణలు గుర్తు చేసిన కేశినేని
ఓ రోజు హఠాత్తుగా.. దేవినేని ఉమపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కేశినేని నానీ , కొడాలి నానికి మంత్రి పదవి రావడానికి దేవినేని ఉమనే కారణమని అందుకు కొడాలి నాని ఆయనకు కృతజ్ఞుడై ఉండాలని రాశారు. దీంతో కొడాలి నానీకి. దేవినేనికి మధ్య ఉన్న పాత ఘర్షణలు గుర్తు చేశాడు కేశినేని నానీ . ఇక ఈ పోస్ట్ తో దేవినేని ఉమతో కేశినేని నానికి పార్టీలో వర్గ విబేధాలున్నాయని బయట పడింది. ఇక పార్టీలో దేవినేని ఉమా వల్ల ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం . కృష్ణా జిల్లా పార్టీ మొత్తాన్ని దేవినేని ఉమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఇక ఆ అసహనం కూడా కేశినేని నానీకి తోడయ్యిందని తెలుస్తుంది.
పలు కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్న కేశినేని నానీ , దేవినేని ఉమాలు .. ఎలాంటి విబేధాలు లేనట్టే ముచ్చట్లు
ఒకరి మీద ఒకరికి విద్వేషాలు పీక్స్ లో ఉన్నాయని భావిస్తున్న తరుణంలో వీరిద్దరూ ఎదురు పడితే , ఒకే కార్యక్రమంలో పాల్గొంటే ,ఎలా ఉంటుందనే ఆసక్తి అందరికీ ఉంది. ఇక ఆ సందర్భం కూడా వచ్చింది. ఆదివారం వీరిద్దరూ నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఆ తర్వాత పలు గ్రామాల్లో వివిధ కార్యక్రమాల్లో కలిసే పాల్గొన్నారు. ఇద్దరూ కలిసే ఉన్నారు. బాగానే ముచ్చట్లు చెప్పుకున్నారు. వేదికలపై ప్రసంగించారు. ఒకరి మీద ఒకరు ఎలాంటి వ్యాఖ్యలు చేసుకోలేదు . కానీ తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవు అన్న చందంగా వ్యవహరించారు. అంతకు ముందు ఏమీ జరగలేదన్నట్లే ఉన్నారు. దీంతో కేశినేని నాని , దేవినేని ఉమా మధ్య విబేధాలు సద్దు మణిగాయా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది. ఇక దీంతో నానీ కూల్ అయ్యారన్న భావన కలిగింది. ముందు ముందు కేశినేని నానీ ఏం చెయ్యబోతున్నారు అనేది మరి చూడాలి.