వైఎస్ జగన్ , షర్మిల పేర్లు చెప్పి టీడీపీలో విబేధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో టిడిపి విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీ కేశినేని నాని విజయవాడలో నిర్వహిస్తున్న ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తన 20 నెలల పాలనలో సాధించింది ఏమీ లేదని, ఆయనపై ఆయనకే నమ్మకం లేదని కేశినేని నాని పేర్కొన్నారు. ఓడిపోతారన్న భయంతోనే టిడిపి అభ్యర్థులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించిన కేశినేని నాని, విజయవాడలో టీడీపీ అభ్యర్థులు ధైర్యంగా నిలబడ్డారని స్పష్టం చేశారు .
మున్సిపోల్స్ .. ప్రత్యర్ధి అభ్యర్థులకు వైసీపీ నేతల ప్రలోభాల ఎర .. డిఫెన్స్ లో ప్రతిపక్షాలు
జగన్ కు , షర్మిలకు విభేదాలు లేవా ? ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
అదే సమయంలో విజయవాడ టీడీపీలో నెలకొన్న విభేదాల పై ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబం అన్న తర్వాత రకరకాల మనస్తత్వాలు ఉన్నవారు ఉంటారని, చిన్న చిన్న మనస్పర్ధలు కామన్ అని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు, ఆయన తల్లి విజయమ్మకు మధ్య విభేదాలు లేవా అంటూ ప్రశ్నించారు కేశినేని నాని. అన్న ఒక పార్టీ పెట్టారు. చెల్లి షర్మిల ఇంకో పార్టీ పెట్టారు. వాళ్లకి ఉన్నాయిగా విభేదాలు.. ఇవన్నీ మామూలే అంటూ టీడీపీలో నెలకొన్న విభేదాలపై కేశినేని నాని కొట్టిపారేశారు.
విజయవాడలో టీడీపీ గెలిస్తే సీఎం గా జగన్ రాజీనామా చేస్తారా .. కేశినేని సవాల్
ఒక కుటుంబంలోనే సహజంగా విభేదాలు ఉంటాయని, అలాంటిది రాజకీయాల్లో ఉండవా అంటూ ప్రశ్నించారు కేశినేని నాని. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేస్తే జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ కేశినేని నాని సవాల్ విసిరారు. సీఎం జగన్ కు తాను ఎన్నికల్లో గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంటే తన సవాలును స్వీకరించి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో కచ్చితంగా టిడిపి కార్పొరేషన్ ను కైవసం చేసుకుంటుందని కేశినేని నాని పేర్కొన్నారు.
బెదిరిస్తూ ,ప్రలోభాలకు వైసీపీ నేతలు గురి చెయ్యటానికి కారణం కేవలం భయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అభ్యర్థులను బెదిరిస్తూ, ప్రలోభాలకు గురి చేస్తూ నామినేషన్ల ఉపసంహరణకు వైసిపి అనేక విధాలుగా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు కేశినేని నాని. కానీ విజయవాడలో మాత్రం టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోబోరని తేల్చి చెప్పారు. విజయవాడలో ఉన్న వారంతా ఫైటర్స్ అని పేర్కొన్నారు. ఏపీని నాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు ఈ ఎన్నికల్లో తప్పక బుద్ధి చెప్తారని కేశినేని నాని పేర్కొన్నారు.
విజయవాడ కార్పోరేషన్ లో టీడీపీ విజయం ఖాయం అన్న ఎంపీ కేశినేని నాని
మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి 75 నుంచి 80 శాతానికి పైగా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ లోని 64 డివిజన్ లలో 45 నుంచి 50 వరకు టిడిపికి వస్తాయని కేశినేని నాని స్పష్టం చేశారు. జగన్ తనపై తనకు నమ్మకం లేకనే బెదిరింపులకు పాల్పడడం, బేరసారాలు సాగించడం చేస్తున్నారని కేశినేని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.