నిమ్మగడ్డ ప్రసాద్ కు పట్టిన గతే మీకు పడుతుందని జగన్ కు ట్వీట్ ...కేశినేని హిట్ లిస్ట్ లో నిమ్మగడ్డ
Recommended Video
ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న కేశినేని నానీ.. తాజాగా నిమ్మగడ్డ ప్రసాద్, పీవీపీ మరియు జగన్ ను టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా మాటల దాడిని పెంచారు. ప్రతి రోజు సోషల్ మీడియా లో పోస్ట్ లతో హల్ చల్ చేస్తున్న నానీ మరోమారు పీవీపీ ,జగన్ లతో పాటు నిమ్మగడ్డను కూడా తన లిస్టు లో చేర్చి వారిపై తన వాగ్బాణాలను సంధించారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానీ సొంత పార్టీ నేతలను, ప్రత్యర్థి పార్టీ నేతలను అన్న తేడా లేకుండా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న హంగామా ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది .
వేలాది కోట్లను తిరిగి చెల్లించిన తరువాత శ్రీరంగ నీతులు చెప్పాలని ట్వీట్ చేసిన నానీ
కేశినేని నాని తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత కొంతకాలంగా తన సంచలన ట్వీట్లతో కలకలం రేపుతున్న విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం నేత కేశినేని నాని, ఈ ఉదయం మరో ట్వీట్ పెట్టారు. నిమ్మగడ్డ ప్రసాద్ కు పట్టిన గతే జగన్ కు కూడ పడుతుందని ఆయన తన ట్వీట్ ద్వారా హెచ్చరించారు. "అయ్యా జగన్ రెడ్డి గారు అసలే బ్యాంకుల పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన వేలాది కోట్లను తిరిగి చెల్లించిన తరువాత శ్రీరంగ నీతులు చెప్పమనండి. లేకపోతే నిమ్మగడ్డ కు పట్టిన గతే పడుతుంది" అని నాని అన్నారు.
నిమ్మగడ్డ అరెస్ట్ కు, పీవీపీకి లింక్ చేసి అలాంటి పరిస్థితే వస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించిన నానీ
ఇక ఈ పోస్ట్ కు పీవీపీకి బ్యాంకు అధికారులు బ్యాంకు నుండి రుణంగా తీసుకున్న డబ్బు చెల్లించాలని పంపిన నోటీసును కలిసి పెట్టారు. మూడు రోజుల క్రితం సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయ్యారు . వాన్ పిక్ భూముల వ్యవహారంలో జగన్ తో పాటు నిమ్మగడ్డ కూడా నిందితుడు . దీంతో నిమ్మగడ్డను జగన్ ఎలాగైనా ఇండియా తీసుకురావాలని కేంద్ర సహాయం కోరారు. ఇక ఇదే సమయంలో మొన్నటికి మొన్న జగన్ కు బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులు చెయ్యటం చేతకాకపోతే తాను చేస్తానని , జగన్ నిమ్మగడ్డ వ్యవహారం చూసుకోవచ్చని సెటైర్ వేసిన నానీ ఇప్పుడు నిమ్మగడ్డ జైలుపాలైన అంశాన్ని , బ్యాంకులకు కుచ్చు టోపీ పెడితే పీవీపీ కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తూ అది మీకు కూడా అన్నట్టు జగన్ ను టార్గెట్ చేసి పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నిమ్మగడ్డను తన లిస్ట్ లో చేర్చి కామెంట్స్ చేస్తున్న కేశినేని
ఒకరుపోయి ఇద్దరు పోయి ఇప్పుడు కేశినేని నానీ హిట్ లిస్టు లో అటు టీడీపీ నుండి, ఇటు వైసీపీ నుండి చాలా మంది నేతలే జమ అయ్యారు. మొన్న నిమ్మగడ్డ ప్రసాద్ ను కెలికిన నానీ ఇక ఇప్పుడు నిమ్మగడ్డ వ్యవహారాన్ని ఏకంగా నెట్టింట్లోకి లాగి ఆయన గురించి మాట్లాడారు. అందరి మీద కేశినేని మాటల దాడి సరే .. అందరూ కలిసి అసలే అధికారంలో లేని టీడీపీ ఎంపీ కేశినేనిని టార్గెట్ చేస్తే కేశినేని పరిస్థితి ఏంటో.. ఒక పక్క సొంత పార్టీ నేతలు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అయినా కేశినేని ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నారో మరి .