కేశినేని, బుద్దాల ట్వీట్ వార్ పై వైసీపీ నేత పొట్లూరి ఘాటు వ్యాఖ్యలు
విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో ట్వీట్ ల వార్ నడుస్తుంది .అయితే వీరి మధ్య జరుగుతున్న యుద్ధానికి విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం కారణంగా పలువురు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తాను సూచించిన అభ్యర్ధికి టిక్కెట్టు కేటాయిస్తే పరిస్థితి మరోలా ఉండేదని కేశినేని నాని అభిప్రాయంగా ఉంది. పార్టీలో తనమాతకు విలువ లేదని బాధ పడుతున్న నానీ గత కొంత కాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన మూడు ఎంపీ స్థానాల్లో విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం స్థానాలు. పార్టీకి ఎదురుగాలి వీచిన సమయంలో కూడ ఈ మూడు స్థానాల్లో ఎంపీలు విజయం సాధించారు.
జగన్ పాలనపై జయప్రకాశ్ నారాయణ్ .. ఇది జమిందారీ వ్యవస్థ కాదన్న జేపీ
విజయవాడ అసెంబ్లీ స్థానం గురించే పంచాయితీ ..
వచ్చే ఎన్నికల్లో విజయవాడలోని పశ్చిమ అసెంబ్లీ స్థానంలో పోటీ విషయమై నేతల మధ్య విభేదాలకు కారణంగా తెలుస్తోంది. విజయవాడలోని పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో నాగుల్ మీరా పోటీ చేస్తారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించటమే బుద్దా వెంకన్న ఆగ్రహానికి కారణంగా తెలుస్తుంది . చంద్రబాబుకు సంబంధం లేకుండా ఈ విషయాన్ని నాని ప్రకటించడంపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అసంతృప్తితో ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేసుకొంటున్నారు. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎప్పుడో మళ్ళీ జరిగే ఎన్నికల్లో పోటీ చెయ్యటం కోసం ఇప్పటి నుండే తన్నుకు చస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు . ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ కూతురు పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే .
ట్వీట్ లలో ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధిస్తూ గొడవకు దిగిన టీడీపీ కీలక నేతలు .. భేటీ కానున్న బాబు
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్లో వచ్చే ఎన్నికల్లో నాగుల్ మీరా పోటీ చేస్తారని కేశినేని నాని ప్రకటనతో బుద్దా ఈ విషయంపై నాని అనుచరుల వద్దే నిరసన వ్యక్తం చేశారు.ఈ మాటలు నానికి చేరాయి. దీంతో నాని ట్విట్టర్ వేదికగా బుద్దా వెంకన్నపై విమర్శలను గుప్పించారని చెబుతున్నారు. వరుసగా ట్వీట్లతో బుద్దా వెంకన్నపై నాని విమర్శలు చేశారు. నాని విమర్శలకు బుద్దా వెంకన్న కూడ కౌంటరిచ్చారు. కానీ ట్వీట్ వార్ ఆదివారం నాడు పతాకస్థాయికి చేరింది. నేను పార్టీలో ఉండాలంటే మీ పెంపుడు కుక్కలను కంట్రోల్ చెయ్యాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు కేశినేని నానీ . దీంతో సోమవారం నాడు ట్వీట్ల యుద్దంలో కేశినేని నాని చంద్రబాబును కూడ లాగారు. ఈ విషయంపై టీడీపీ నాయకత్వం స్పందించింది. ఇద్దరికి ఫోన్లు చేసి సంయమనం పాటించాలని సూచించింది. వీరిద్దరితో చంద్రబాబునాయుడు సమావేశమయ్యే అవకాశం ఉంది.
కేశినేని నాని, బుద్దా వెంకన్నల ట్వీట్ వార్ పై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ట్వీట్.. బ్యాక్ సీట్లు పెంచటం కాదని ఫైర్
ఇక ఇదే అదనుగా కేశినేని నాని, బుద్దా వెంకన్నల ట్వీట్ వార్ పై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నానీకి, బుద్దా వెంకన్నకు చురకలు అంటించారు చట్టసభల్లో బల్లలరిగేలా కూర్చుని బ్యాక్ సీట్లు పెంచడం కాదని చెప్పి మిమ్మల్ని ఎంచుకున్న ప్రజలకు ఏమైనా చేసేది ఉందా? లేదా? అని ప్రశ్నించారు పొట్లూరి వరప్రసాద్ . అంతే కాదు ట్విట్టర్లో కూర్చుని కాలక్షేపం చేస్తారా? అని మండిపడ్డారు. మీ ఇద్దరి పరస్పర ఆరోపణలతో ప్రజలంతా ఏకీభవిస్తున్నారని ఒకరి ఘనత మరొకరు బాగానే చెప్పుకుంటున్నారని పీవీపీ ట్వీట్లో పేర్కొన్నారు. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా వీరి మధ్య గొడవ వైసీపీ నేతలకు ఎద్దేవా చెయ్యటానికి అవకాశం ఇచ్చింది.