కేశినేని కామెంట్స్ చిచ్చు-టికెట్ ఎవరికిచ్చినా ఓకే అన్న చిన్ని-ప్రక్షాళనకు బుద్ధా మద్దతు..!
విజయవాడ టీడీపీలో వర్గపోరు మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇప్పటికే కేశినేని నాని, చిన్ని వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్న నేతలు..ఇవాళ కూడా దాన్ని కొనసాగించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ నేతలు.. కేశినేని నాని కామెంట్స్ పై స్పందించారు. నాని తాజాగా చేసిన కామెంట్స్ లో కొన్నింటితో ఏకీభవించిన నేతలు... మరికొన్నింటితో విభేదించారు.
కేశినేని నాని కామెంట్స్ రచ్చ
నిన్న మొన్నటివరకూ మౌనంగా సాగిపోతున్న టీడీపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యంగా తనపై పోటీ కోసం సోదరుడు చిన్ని చేస్తున్న రాజకీయాలు, అందులో భాగస్వాములవుతూ పాత ప్రత్యర్ధులు చేస్తున్న ప్రయత్నాలపై నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు టీడీపీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, అదొక్కటే తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీంతో కేశినేని నాని కామెంట్స్ ప్రత్యర్ధులైన చిన్ని, బుద్దా వెంకన్న వంటి వారిని ఎక్కడో తాకాయి. దీంతో వారు ఇవాళ స్పందించారు.
టికెట్ ఎవరికిచ్చినా ఓకే అన్న చిన్ని
విజయవాడ ఎంపీ టికెట్ తెచ్చుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు సోదరుడు నాని చేసిన వ్యాఖ్యలపై చిన్ని స్పందించారు. అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇస్తే వారికి సహకరిస్తానన్నారు. కేశినేని నానికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేయడానికి సిద్ధమేనన్నారు. తాను ప్రస్తుతం సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నానని, పార్టీ ఆఫీసుకు కూడా వెళ్లలేదని చెప్పుకొచ్చారు. 2014లో నాని విజయానికి పనిచేశానని, 2019లో విభేదాలు వచ్చాక దూరంగా ఉన్ననన్నారు. కానీ టీడీపీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పని చేయలేదన్నారు.
కేశినేని ప్రక్షాళన వ్యాఖ్యల్ని సమర్ధించిన బుద్దా
రెండు రోజులుగా కేశినేని నాని ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆయనే చెప్పాలని బుద్ధా వెంకన్న తెలిపారు. తాను మిస్టర్ట్ క్లీన్గా ఉన్నప్పుడు, తనను అన్నారని అనుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీగా వివిధ పదవులు చేపట్టినప్పటికీ తనపై చిన్న భూ కబ్జా ఆరోపణ కూడా రాలేదన్నారు. కాబట్టి తనను పేరు పెట్టి అంటే మాత్రమే స్పందిస్తానన్నారు. తనకూ, కేశినేని నానికి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో భేదాభిప్రాయాలు వచ్చాయి తప్ప వ్యక్తిగత కక్షలు లేవన్నారు. పార్టీలో ప్రక్షాళన జరగాలనే కేశినేని వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానన్నారు. టికెట్ల విషయంలో మాత్రం చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అన్నారు.